Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రంప్ విధానాలు.. ప్రవాస భారతీయులలో ఆందోళన
posted on: Apr 24, 2026 3:02PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న కఠినమైన వలస విధానాలు అక్కడి భారతీయ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకే అనే నినాదం ఇప్పుడు అధికారిక విధానంగా మారుతుండటంతో, దశాబ్దాలుగా అక్కడ స్థిరపడిన వారు సైతం తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ మూలాలున్న లక్షలాది మంది వలసదారుల జీవితాలు ఇప్పుడు డోలాయమానంలో పడ్డాయి.
తాజాగా వెలువడిన కార్నెగీ ఎండౌమెంట్ సర్వే నివేదికలు విస్తుపోయే నిజాలను వెల్లడించాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతి ప్రజలలో సుమారు 40 శాతం మంది ఆ దేశాన్ని శాశ్వతంగా వీడి వెళ్లాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం ఒక సర్వే ఫలితం మాత్రమే కాకుండా.. అమెరికాలో మారుతున్న రాజకీయ సామాజిక వాతావరణానికి దర్పణం పట్టేదిగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవాస భారతీయులలో ఈ స్థాయిలో నిరాశ పెరగడం గమనార్హం.
ఈ ఆలోచనకు ప్రధాన కారణం అక్కడి రాజకీయ అస్థిరత అని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది ప్రస్తుత రాజకీయ పరిణామాలే తమ అసంతృప్తికి కారణమని స్పష్టం చేశారు. ట్రంప్ పాలనలో వినిపిస్తున్న వలస వ్యతిరేక వ్యాఖ్యలు, జాతి, మతపరమైన విభజనలు పెరగడం వల్ల అమెరికా ఇకపై ఎంత మాత్రం సురక్షితం కాదనే భావన బలపడుతోంది. దాదాపు 71 శాతం మంది భారతీయ అమెరికన్లు ట్రంప్ రెండో పర్యాయం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ముఖ్యంగా చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే వారిపై ఆంక్షలు పెరగడం పెద్ద చర్చకు దారితీస్తోంది. కాటో ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం, అక్రమ వలసల కంటే చట్టబద్ధంగా వచ్చే వారి సంఖ్యలోనే భారీగా పతనం నమోదైంది. నిబంధనల ప్రకారం వచ్చే వృత్తి నిపుణులకు కూడా అడ్డంకులు సృష్టించడం వల్ల, అమెరికా తన తలుపులు మూసేస్తోందనే సంకేతాలు అందుతున్నాయి. ఇది నేరుగా భారతీయ ఐటీ రంగ నిపుణులపై ప్రభావం చూపుతోంది.
టెక్ రంగానికి ప్రాణాధారమైన హెచ్-1బీ వీసాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఏడాదిలో వీసాల జారీ 25 శాతం తగ్గడమే కాకుండా.. పిటిషన్లపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించడం వల్ల కంపెనీల దరఖాస్తులు ఏకంగా 87 శాతం పడిపోయాయి. దీనివల్ల ప్రతిభామంతులైన భారతీయ యువతకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు దక్కడం గగనంగా మారుతోంది. కేవలం ఉద్యోగులే కాకుండా, ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల వీసాల జారీలో కూడా 40 శాతం తగ్గుదల కనిపించింది. సోషల్ మీడియా వెట్టింగ్, కఠినమైన భద్రతా తనిఖీలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
అమెరికా జనాభాలో కేవలం 1.5 శాతమే ఉన్నప్పటికీ, 5.4 మిలియన్ల భారతీయ సంతతి ప్రజలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ, మెడిసిన్, ఫైనాన్స్ వంటి రంగాల్లో భారతీయుల కృషి వెలకట్టలేనిది. అయితే ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న గౌరవం, భద్రత, స్థిరత్వం వంసమస్యలు అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకప్పుడు అవకాశాల గనిగా వెలిగిన అమెరికా.. ఇప్పుడు వలసదారుల దృష్టిలో ఒక సందేహాస్పద ప్రాంతంగా మారుతోంది.
ప్రస్తుత తరుణంలో ప్రతీ భారతీయ కుటుంబంలోనూ అమెరికాలో ఉండాలా లేక తిరిగి రావాలా? అనే చర్చ మొదలైంది. ట్రంప్ అనుసరిస్తున్న సంరక్షణాత్మక విధానాలు అమెరికా జాతీయ భద్రతకు అవసరమని కొందరు వాదిస్తున్నప్పటికీ, గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
-సీతారాం కంఠంనేని



.webp)


