Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్.. అలాంటిదేం లేదన్న ఇరాన్!
posted on: Jun 12, 2026 8:53AM

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించే దిశగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధ వాతావరణాన్ని ముగింపుకు తెస్తూ శాంతి ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై జరప తలపెట్టిన అమెరికా దళాల భారీ సైనిక దాడుల ప్రణాళికను కూడా తక్షణమే రద్దు చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ ద్వారా కూడా ఈ విషయాన్ని ట్రంప్ షేర్ చేశారు. ఇరాన్తో యుద్ధాన్ని నివారించడానికి ఇదో గొప్ప పరిష్కారమనిపేర్కొన్నారు.
అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. అమెరికా చేస్తున్న వాదనలు చాలా తొందరపాటు చర్యలని.. తుది ఒప్పందంపై తాము ఇంకా ఎ అధికారిక ఆమోదం తెలుపలేదని కుండబద్దలు కొట్టింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) అనుబంధ సంస్థ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ప్రాథమిక అవగాహన ఒప్పందానికి సంబంధించిన ఏ ఒక్క పత్రంపైనా ఇరాన్ సంతకం చేయలేదు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ .. ఒప్పందంలోని చాలా భాగాలు చర్చల ద్వారా ఖరారైన మాట వాస్తవమే అయినా.. అమెరికా పదేపదే తన వైఖరిని మారుస్తోందని, అందుకే తాము ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు. వాషింగ్టన్ కనుక తమ ప్రతిపాదనలను పూర్తిగా అంగీకరిస్తేనే ఇరాన్ ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తుందని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
అదలా ఉంటే అగ్రరాజ్యాధినేత ట్రంప్ ప్రకారం.. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్థాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ వంటి పలు గల్ఫ్ దేశాలు ఈ శాంతి ముసాయిదా ఒప్పందానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. ఈ వారాంతంలోనే యూరప్లో అధికారిక సంతకాల ప్రక్రియ పూర్తవుతుంది.
తద్వారా ఘర్షణల కారణంగా మూతపడిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తారు. అలాగే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోనని ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటుంది. అయితే బుధవారం టెహ్రాన్లో జరిగిన చర్చల్లో ఒక సూత్రప్రాయ అంగీకారం కుదిరినప్పటికీ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నుండి ఇంకా తుది ఆమోదం రావలసి ఉందని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా తన నౌకాదళంతో ఇరాన్పై ఒత్తిడిని కొనసాగిస్తుండగా, ఇరాన్ మాత్రం తమపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల పూర్తి ఉపసంహరకు పట్టుబడుతోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న విశ్వాసరాహిత్యాన్ని చాటుతున్నాయి.






