ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తానంటున్న ట్రంప్
posted on Nov 7, 2025 12:32PM

అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరో సారి దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయగమని చెబుతున్నారు. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్తో చర్చించినట్లు వెల్లడించిన ఆయన ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్లో మాట్లాడుతూ.. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో మేం ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం. అయితే ఆ అవసరం లేదు. ప్రతిఒక్కరూ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ఇతర విషయాలు ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన ట్రంప్.. దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం అవి లేవన్నారు.
మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని చెప్పారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయి. మా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయన్న హెచ్చరిక లాంటి వ్యాఖ్యలు చేశారు.
మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు. కానీ, అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చించానన్నారు. అయితే ఎక్కడ, ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ బయటపెట్టలేదు.