జగన్ పై తెరాస యంపీ విమర్శలు???
posted on: Sep 10, 2014 6:08PM
.jpg)
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పాలన స్వర్ణ యుగమని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు తరచూ అభివర్ణిస్తుంటారు. అంతే కాదు జగనన్న గెలిస్తే ఆ రాజన్నరాజ్యాన్ని తిరిగి తీసుకు వస్తామని ఎన్నికల సమయంలో చాలా గట్టిగా ప్రచారం చేసుకొన్నారు కూడా. కానీ ప్రజలు మాత్రం ఆ రాజ్యం మాకొద్దని జగనన్నకు ఓడించి చంద్రన్నకు పట్టం కట్టారు. కానీ ఈ విషయం గ్రహించని టీ-కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అలవాటులో పొరపాటుగా మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలలో కూడా ‘రాజన్న రాజ్యం’ గురించి ప్రస్తావించి, రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణా చాలా బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకొని, తెరాసకు ఒక మంచి ఆయుధం అందించారు.
దానిపై తెరాస యంపీ వినోద్ చాలా ఘాటుగా స్పందించారు. “రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎవరు అభివృద్ధి చెందారో సీబీఐ చెపుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి, అనేకమంది ఐఎఎస్ అధికార్లు జైలుకు వెళ్లడమే అభివృద్ది అని బహుశః పొన్నాల భావిస్తున్నారేమో?” అని జవాబిచ్చారు.
వినోద్ విమర్శలు సహేతుకంగానే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కొత్త రాజకీయ పరిణామమనుకోవాలా? ఎందుకంటే తెలంగాణాలో వైకాపా జీవచ్చవంలా ఉన్నప్పటికీ, దానికి తిరిగి ఊపిరిపోసి బలమయిన రాజకీయ శక్తిగా మలిచేందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఆసక్తి చూపలేదు. కానీ ఇకపై తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వినపడుతున్న నేపధ్యంలో చూస్తే తెరాస యంపీ విమర్శలు అనాలోచితంగా చేసినవనుకోవడానికి లేదు.



.jpg)
.jpg)

.webp)



