ఆంద్ర ప్రజలపై తెరాస ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు?

posted on: Jul 4, 2014 7:07AM

 

తెరాస ప్రభుత్వం భూముల స్వాధీనం విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఇంతవరకు చట్ట విరుద్దంగా ఆక్రమింపబడిన భూములపైనే దాడులకు అనుమతి ఈయడంతో, సంబందిత వ్యక్తులు తప్ప ఇతరులెవరూ పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏపి.ఎన్.జి.ఓ. సంఘానికి గోపన్న పల్లె వద్ద గతంలో ప్రభుత్వం కేటాయించిన 189 ఎకరాల భూమిని ఎటువంటి నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకోవడంతో వారిని కోరుండి రెచ్చగొట్టినట్లయింది.

 

శేరీలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ మరియు రాజేంద్రనగర్ ఆర్డిఓ సురేష్ తమ సిబ్బందితో కలిసి వెళ్లి ఏపీయన్జీవోలకు చెందిన స్థలాన్ని స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వారికి ఇల్లు కట్టుకోనేందుకు భూమి కేటాయించినప్పటికీ ఇంతవరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరుగనందున భూమిని స్వాదీనం చేసుకొంటున్నట్లు వారు ప్రకటించారు. అయితే ఈ భూమిని ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇల్లు కట్టుకోనేందుకు ఇచ్చింది తప్ప, ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు రాయితీ మీద పరిశ్రమలో, వ్యాపార సంస్థలో పెట్టుకొనేందుకు అమ్మలేదు. ప్రభుత్వం ఏపీ యన్జీవో సంఘం సభ్యులందరికీ భూమిపై హక్కులు కల్పిస్తూ పట్టాలు కూడా ఇచ్చింది. కానీ ఆ భూమి తమదంటూ వేరే కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయడం వలన, ఇతరత్రా కారణాల వలన ఉద్యోగులు అక్కడ ఇల్లు నిర్మించుకోలేదు. కానీ దానిని సాకుగా చూపి ఆంద్ర ఉద్యోగులకు కేటాయించిన భూములను తెరాస ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాదం కవ్వింపు చర్యే అవుతుంది.

 

వారం రోజుల క్రితం జీ.హెచ్.యం.సి. అధికారులు సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ లోకి జొరబడి కొలతలు తీసి, అది ఆక్రమింపబడిన స్థలంగా గుర్తులు వేయడంతో, వారి చర్యలను ఖండిస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషను వేసారు. దానిపై కోర్టు స్పందిస్తూ ముందుగా నోటీసులు జారీ చేయనిదే ఎవరిపై చర్యలకు పాల్పడవద్దని ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ, శేరీలింగంపల్లి తహశీల్దార్ మరియు రాజేంద్రనగర్ ఆర్డిఓలు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ప్రభుత్వోద్యోగులకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకొంటున్నామని ప్రకటించడంతో, ఏపీ యన్జీవోలు న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఒకవేళ వారు భూమిపై తమ హక్కులను కోర్టులో నిరూపించుకోగలిగి, వారి వాదనలతో కోర్టు కూడా ఏకీభవించినట్లయితే తెరాస ప్రభుత్వం అభాసు పాలవవచ్చును.

 

రెండు మీడియా చాన్నాళ్ళపై నిషేధం, నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ పై చర్యలు, నాగార్జున సాగర్ నుండి ఆంధ్రాకు నీటి విడుదలకు అభ్యంతరాలు, ఇప్పుడు ఎన్జీజీవోల భూములు స్వాధీనం వంటి తెరాస ప్రభుత్వం చర్యలన్నీ ఆంద్ర ప్రజలపై చాలా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లే ఉన్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన తరువాత కూడా రాజకీయ నేతల్లాగే వ్యవహరిస్తే దాని వలన వారే అప్రదిష్ట పాలవుతారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...