పశ్చిమ బెంగాల్ లో కదులుతున్న తృణమూల్ పునాదులు!

posted on: May 27, 2026 10:30AM

తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసల పర్వం ప్రారంభమైందంటూ బీజేపీ నాయకుడు సౌమిత్రఖాన్  చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో   తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు కీలక ప్రజాప్రతినిధులు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన బాంబు పేల్చారు.

  తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు బీజీపీతో టచ్ లో ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీరంతా మమతా బెనర్జీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, బీజేపీ హైకమాండ్ ఇలా పచ్చజెండా ఊపితే.. వారంతా అలా వచ్చి  కాషాయ తీర్థం పుచ్చుకుంటారనీ, ని బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖన్ బుధవారం (మే 27) సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ వీరందరినీ చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయిస్తే తృణమూల్ కాంగ్రెస్ ఒక రాజకీయ శక్తిగా ఉనికినే కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. అయితే.. సౌమిత్ర ఖన్ చేసిన ఈ వ్యాఖ్యలను తృణమూల్ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ పూర్తిగా ఖండించారు. ఇదంతా అబద్ధమని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని కొట్టిపారేశారు. 

అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది. 

మరోవైపు..  రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలకు చెందిన దాదాపు 100 మంది కౌన్సిలర్లు ఇటీవల  తృణమూల్ కు రాజీనామా చేశారు.  భట్పరా మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ రేబా రాహా సహా  30 మంది కౌన్సిలర్లు టీఎంసీకి గుడ్ బై చెప్పారు. అలాగే హలిసహర్‌లో 16 మంది, కాంచ్రాపారలో 14 మంది కౌన్సిలర్లు రాజీనామాలు సమర్పించారు. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...