కేరళలో పోటీ చేయనున్న తృణమూల్ కాంగ్రెస్‌

posted on: Mar 12, 2016 3:34PM

పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య ఉన్న పొత్తు అనైతికమని విమర్శలు చేస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తమ పార్టీ కేరళలో కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం ఇవాళ 70 మంది అభ్యర్థులతో కూడిన ఒక జాబితాను కూడా విడుదల చేశారు. కేరళలో అసెంబ్లీ పోరు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, విపక్షంగా ఉన్న వామపక్షాల మధ్య జరగనున్న విషయం తెలిసిందే! ఒకపక్క పశ్చిమ బెంగాల్లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని కేరళలో ఎలా కత్తులు దూసుకుంటాయని మమతా విమర్శిస్తూనే ఉన్నారు.

కేరళలో ఈ రెండు పార్టీలూ కలిసి నాటకం ఆడుతున్నాయని తరచూ దుయ్యపడుతున్నారు. కేరళలో మమత పార్టీ పోటీ చేయడమే కాదు. తమ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో తలమునకలై ఉన్నా కూడా మమతా బెనర్జీ, కేరళలో కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. కేరళలో దాదాపు 15 లక్షల మంది బెంగాలీలు ఉన్నారనీ, వీరందరి ఓట్లూ తమకే పడతాయనీ ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే తృణమూల్‌ కేరళలో ఒక్క సీటైనా గెల్చుకుంటుందని ఆ పార్టీకే నమ్మకం లేదు. కానీ తమకి పడే ఓట్లు ఈ ఎన్నికల తీరుని ప్రభావితం చేస్తాయనీ, వచ్చే ఐదేళ్లలో తాము ఒక బలమైన శక్తిగా ఎదుగుతామనీ అక్కడి తృణమూల్‌ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...