మైసూరు సామ్రాజ్యంలో అధికార మార్పిడి.. చరిత్ర చెబుతున్న సత్యాలు

posted on: May 12, 2026 5:04PM

దక్షిణ భారత చరిత్రలో మైసూరు సామ్రాజ్యానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో ఈ రాజ్యంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు కేవలం ఒక వంశం నుంచి మరొక వ్యక్తికి అధికారం మారడమే కాకుండా..  మొత్తం రాజ్య గమనాన్ని మార్చివేశాయి. కృష్ణరాజ వడియార్-2 పాలనలో ప్రారంభమైన ఈ మార్పులు, ఒక సాధారణ సైనికుడిగా ఉన్న హైదర్ అలీని అత్యంత శక్తిమంతమైన  డీ ఫాక్టో' పాలకుడిగా ఎలా మార్చాయనేది చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన అంశం.

  కృష్ణరాజ వడియార్-2  హయాంలో అంటే..  1728, 1756  మధ్య కాలంలో మైసూరు పైకి  చూడటానికి ప్రశాంతంగా ఉన్నప్పటికీ,   అంతర్గత వ్యవహారాల్లో తీవ్రమైన మార్పులు సంభవిస్తూ ఉండేవి. ఆ సమయంలో వడియార్ రాజులు పరిపాలన పరంగా బలహీనపడటం..  సైన్యంపై వారి పట్టు సడలడం గమనించవచ్చు. రాజవంశం పేరుకు మాత్రమే అధికారంలో ఉన్నప్పటికీ.. వాస్తవ అధికారం మాత్రం సైనిక బలగం వైపు మళ్లుతూ ఉండేది. అదే సమయంలో సైన్యంలో ముస్లిం అధికారుల ప్రాధాన్యత పెరగడం.. ముఖ్యంగా హైదర్ అలీ కుటుంబం కీలక పాత్ర పోషించడం ప్రారంభమైంది.  

ఒక సామాన్య సైనికుడిగా వృత్తిని ప్రారంభించిన హైదర్ అలీ, తనకున్న అసాధారణమైన యుద్ధ తంత్రాలు, ఆర్థిక నిర్వహణ సామర్థ్యం,  రాజకీయ చతురతతో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్నారు. రాజకోటలో నెలకొన్న విభేదాలు, పాలకుల అసమర్థతను గమనించిన ఆయన.. ఆ ఖాళీని భర్తీ చేస్తూ రాజ్య సర్వాధికారిగా ఎదిగారు.  అయితే..  ఈ అధికార మార్పిడిని కేవలం మతపరమైన కోణంలో చూడటం సరైంది కాదని చరిత్రకారులు చెబుతారు. ఇది పూర్తిగా రాజకీయ,  సైనిక వ్యూహాల సమ్మిళితంగా  జరిగిన పరిణామం  అంటారు. 

జనబాహుళ్యంలో బహుళ ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం..  కృష్ణరాజ వడియార్ మత సామరస్యం గురించి మాట్లాడుతూ.. అందరూ ఒకే దేవుని బిడ్డలు అన్నప్పుడు, హైదర్ అలీ.. అయితే ఈ రాజ్యం ఇకపై అల్లాహ్ పేరుతో తన అధీనంలో ఉంటుందని బదులిచ్చినట్లు చెబుతారు.  అయితే..  ఈ సంభాషణకు చరిత్రలో ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే.. ఆ సమయంలో జరిగిన అధికార బదిలీని ప్రతిబింబించడానికి ప్రజా కథనాల్లో దీనిని వాడుతుంటారు. కృష్ణరాజ వడియార్ నిజంగానే మత సామరస్యాన్ని ఆకాంక్షించిన రాజు అయినప్పటికీ..  రాజ్య ఆర్థిక సమస్యలు,  సైనిక ఒత్తిళ్ల ముందు ఆయన తన అధికారాన్ని కాపాడుకోలేకపోయారు.  

 హైదర్ అలీ సాధించిన ఈ విజయం తదనంతర కాలంలో ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ పాలకుడు కావడానికి మార్గం సుగమం చేసింది. వీరిద్దరి నాయకత్వంలో మైసూరు రాజ్యం ఆధునీకరణ వైపు అడుగులు వేయడమే కాకుండా..  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గట్టి సవాలుగా నిలిచింది. యుద్ధ తంత్రాలలో రాకెట్ సాంకేతికతను వాడటం వంటి విప్లవాత్మక మార్పులు వీరి హయాంలోనే జరిగాయి. దక్షిణాది రాజకీయాల్లో మైసూరు ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ఆనాడు కృష్ణరాజ వడియార్ కాలంలో మొదలైన ఈ రాజకీయ సంధి కాలమే పునాదిగా నిలిచింది.   నేటి తరానికి ఈ చరిత్ర ఇచ్చే సందేశం ఏమిటంటే.. చరిత్రను కేవలం భావోద్వేగాలతో కాకుండా వాస్తవాలతో విశ్లేషించాలి. రాజ వంశాలు బలహీనపడినప్పుడు,  పరిపాలనలో లోపాలు తలెత్తినప్పుడు శక్తివంతమైన వ్యక్తులు అధికారాన్ని చేజిక్కించుకోవడం సహజం. ఒక వ్యక్తి ఎదుగుదల వెనుక ఆ కాలం నాటి సామాజిక,  రాజకీయ పరిస్థితులు ఎలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడం ముఖ్యం.   

మైసూరు చరిత్రలో కృష్ణరాజ వడియార్-2 కాలం ఒక సంధి యుగం. రాజ్యాధికారం ఒక చేతి నుంచి మరో చేతికి మారడం వెనుక అనేక క్లిష్టమైన కారణాలు ఉన్నాయి. దీనిని మతం వర్సెస్ మతం అని చూడటం కంటే.. అధికార దాహం, సైనిక వ్యూహం,  సమకాలీన రాజకీయ మార్పుల సమ్మేళనంగా చూడటమే కరెక్ట్. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా సమాజాన్ని రక్షించుకోవడానికి ఈ అవగాహన ఎంతో దోహదం చేస్తుంది.   

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...