Latest News
శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ ట్రాఫిక్ మళ్లింపులు
posted on: Mar 26, 2026 6:29PM

హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించే శోభాయాత్రకు విస్తృతమైన ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. రేపు మార్చి 27న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాతనగరం, సెంట్రల్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల పాఠశాల వరకు కొనసాగనుంది. ఈ యాత్ర సాగే మార్గంలో భారీగా భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టారు.
నగరంలో ప్రధాన మార్గాలపై మళ్లింపులు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆసిఫ్నగర్, భోయిగూడ కమాన్, అఘాపురా, మంగళ్హాట్, పురానాపూల్, అఫ్జల్గంజ్, బేగంబజార్, అబిడ్స్, కోఠి, చాదర్ఘాట్, కాచిగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు మార్పులు ఉంటాయి. ముఖ్యంగా యాత్ర సాగుతున్న మార్గాల్లో సాధారణ ట్రాఫిక్ను పూర్తిగా మళ్లించనున్నారు. భోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం, టక్కర్వాడీ జంక్షన్, MJ బ్రిడ్జ్, అఫ్జల్గంజ్, బేగంబజార్ ఛత్రీ, SA బజార్, MJ మార్కెట్ వంటి కీలక కూడళ్ల వద్ద వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు దారి మళ్లిస్తారు. రద్దీకి గురయ్యే ప్రాంతాలు పోలీసుల అంచనా ప్రకారం బేగంబజార్ ఛత్రీ, SA బజార్,అఫ్జల్గంజ్ T జంక్షన్,శివాజీ బ్రిడ్జ్ – CBS పరిసరాలు,రంగమహల్ Y జంక్షన్,పుట్లిబౌలి ఎక్స్ రోడ్ అబిడ్స్ GPO, MJ మార్కెట్ ,చాదర్ఘాట్... కాచిగూడ ఎక్స్ రోడ్ ఈ ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది..
ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రజలు అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని, అత్యవసరంగా బయలుదేరే వారు ముందుగా మార్గా లను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం సోషల్ మీడియా పేజీలను ఫాలో కావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్లైన్ 9010203626 ను సంప్రదించవచ్చు. శ్రీరామనవమి వేడుకలను శాంతియుతంగా, భద్రంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసులు విజ్ఞప్తి చేశారు.






