తిరుపతికి 'కొత్త' రెక్కలు...

posted on: Aug 17, 2016 6:26PM

తిరుపతి వెళ్లిన వాళ్లు వేంకటేశ్వరునే కాదు విమాన వేంకటేశ్వరుని కూడా దర్శించుకుంటారు. అయితే విమాన వేంకటేశ్వరుడంటే విమానంలోవుంటాడని అర్థం కాదు! విమాన గోపురంపైన వెలిసిన వేంకటేశ్వరుడని ఉద్దేశ్యం! ఇక మీద వెంకన్న భక్తులు విమాన వేంకటేశ్వరుని విమానంలోనే వెళ్లి దర్శించుకోవచ్చు! అదీ ఆనందకర పరిణామం... 


తిరుపతి విమానాశ్రయం త్వరలో అంతర్జాతీయ విమానాలకు ఆహ్వానం పలుకనుంది. నవ్యాంధ్ర ప్రజల బలమైన కోరికల్లో ఒకటైన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వేంకటేశ్వరుని పాదాల వద్దకి వచ్చేయనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదీ లేదనే చెప్పాలి. త్వరలో తిరుపతికి అంతర్జాతీయ హోదా వస్తే అది రాష్ట్రానికి సరికొత్త సొబుగే అవుతుంది! అంతర్జాతీయ విమానాల చక్కర్లు మొదలైతే అమెరికాతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలకు నేరుగా ఏడుకొండల వాని చరణాల వద్ద నుంచి ఎగిరి వెళ్లిపోవచ్చు. 


తిరుపతి ఎయిర్ పోర్ట్ ని ఇంటర్నేషనల్ డెస్టినేషన్ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టింది మోదీ ప్రభుత్వం. త్వరలో దుబాయ్, కువైట్, అమెరికా లాంటి దేశాలకు రాకపోకలు మొదలవుతాయి. దీని ద్వారా మరింత మంది భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకోవటమే కాకుండా తిరుపతి నగరం ఆర్దికంగా, వ్యాపారపరంగా కొత్త అభివృద్ధిని చవి చూసే అవకాశం వుంది. వేంకటేశ్వరుని పరమ భక్తుడైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి ఈ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి... 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...