అసెంబ్లీలో పవన్ ఆముక్త మాల్యద...అర్ధ తాత్పర్యమేంటంటే!
posted on: Feb 24, 2026 7:01PM
.webp)
అసెంబ్లీలో తిరుమల లడ్డూ నకిలీ నెయ్యి వ్యవహారంలో జరిగిన ఒక చర్చలో పవన్ కళ్యాణ్ విభిన్నమైన శైలిలో ప్రసంగించారు. తాను లడ్డూ కల్తీ చేసింది స్వయంగా గత ప్రభుత్వ అధినేత అని ఏనాడూ చెప్పలేదని ఆయన పదే పదే ఎందుకు చెప్పారు? అన్నది ఒక చర్చనీయాంశం కాగా.. రెండోది అనడం లేదంటూనే అన్ని మాటలు అనేసిన విధం స్పష్టంగా కనిపించింది.
లడ్డూలో నకిలీ నెయ్యి చర్చ సందర్భంగా వీరు మనకొక కొత్త విషయం తెలియ చేశారనీ.. లీటరు పాలు వాడకుండానే నకిలీ నెయ్యి తయారు చేయడం ఎలాగో.. ఈ సమాజానికి వీరు చూపించారనీ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ తప్పంతా బోర్డుదే అవుతుందనీ.. అలాంటి వారిలో ఒకరు తప్పు జరిగింది నిజమని చెబుతుంటే దాన్ని వెనకేసుకురావడం కరెక్టు కాదని ఇండైరెక్టుగా జగన్ కి సూచించారు.
ఇదే నకిలీ వ్యవహారం ఏ ఇతర మతానికి సంబంధించి జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని.. ఈ పాటికి దేశమంతా అల్ల కల్లలోమై పోయేదని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక్కడంటే విష్ణువు కాకుంటే శివుడు, శివుడు కాకుంటే అమ్మవారిగా మారిపోయే భక్త జన సందోహం.. కులాల వారీగా కూడా చీలికలు పేలికలై పోవడం వల్ల ఐక్యత లోపించిందని అన్నారు. ఇదే ఉండకూడదని తాను గతంలోనే దీక్ష చేపట్టానని అన్నారాయన. ఈ ఐక్యత లోపించడం వల్లే తాను సనాతన బోర్డు కూడా రావాలని కోరినట్టు చెప్పారు పవన్.
ఈ తప్పిదంలో ఎవరి నుంచైనా మీరు తప్పుకోవచ్చేమోగానీ, సాక్షాత్ శ్రీవారి నుంచి మాత్రం తప్పించుకోలేరనీ.. ఆయన కలియుగ దైవమనీ.. ఆయన రెండు కళ్లలోకి మీరు చూసి ప్రార్ధించడం సాధ్యం కాదని.. అంతటి మహాపరాధానికి పాల్పడ్డారని అననారు. చివరిగా రెండు మాటలు.. అంటూ శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఆముక్త మాల్యదలోని 218వ పద్యం చదివి వినిపించారు పవన్.అదేమిటంటే.. ప్రజలకై యొడల్ విరిచి, ప్రాణంబులిచ్చి.. రాజ్యపాలనంబు సల్పు రాజుగాక, ప్రజల హింసించి, భక్షించి, పాలుపడెడు రాజధర్మంబు నరకంబు రవణజేయు..
అంటూ పవన్ ఈ పద్యం చదవడమే కాకుండా దాని అర్ధ తాత్పర్యం కూడా చెప్పారు. ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడి.. తన శరీరాన్ని కష్టపెట్టి, అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెట్టి పాలించేవాడే నిజమైన రాజు. ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెడుతూ, వారిని భక్షిస్తూ.. అంటే వారి సంపదను, హక్కులను దోచుకుంటూ.. పాలన చేస్తారో.. అటువంటి పాలకుడు కచ్చితంగా నరకానికి వెళ్తాడు. అదసలు పాలనా రాజధర్మం కాదని సభా ముఖంగా తెలియ చేశారు పవన్.
రాజు ప్రజలను కాపాడాలి తప్ప, దోచుకోకూడదు.. అనే రాజనీతి సూత్రాన్ని.. ఈ పద్యం ద్వారా తెలియ చేశారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో ఆయన మరో మాట కూడా జోడించారు.. రాజు తన కోసం దోచి పెట్టే వారిని తీసుకొచ్చి ఇలాంటి ఆధ్యాత్మిక పదవుల్లో ఉంచరాదని కూడా సూచించారు. ఇక్కడ రెండు విషయాలను ప్రముఖంగా ప్రస్తావించాల్సి ఉంటుంది..
జగన్ని తాను ఏమీ అనలేదు అనలేదు అంటూనే చాలా పెద్ద అర్ధమొచ్చేలాంటి సారాంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ రెండో అంశమేంటంటే.. జగన్ లాంటి వారికి ఇలాంటి సున్నితార్ధాలతో కూడిన పద్యాలకు తాత్పర్యాలు తెలిసే ప్రసక్తే లేదు. జగన్కి కేవలం తెలుగు పాండిత్యమే కాదు.. ఇంగ్లీషులోనూ ఏమీ పెద్ద జ్ఞానం లేదు. పాబ్లో ఎస్కోబార్ ఎవరు? అన్నది కూడా ఆయనకు తెలీదు. అలాంటి మాజీ సీఎం ముందు ఇలాంటి పాండిత్య ప్రదర్శనలు మాత్రం పని చేస్తాయా? అన్న మాట వినిపిస్తోంది. అయితే వైసీపీ అధినేని నేరుగా తాను ఏమీ అనడం లేదు.. అనడం లేదని.. పవన్ అన్నీ అనేశారని కూడా చాలా మంది గుర్తించి చెబుతుండటం విశేషం



.webp)



