అమరావతిలో తిరుమల.!

posted on: Jul 7, 2026 3:11PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని  అమరావతిలో తిరుమల  వెలుస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం  శ్రీకారం చుట్టింది.  రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలోని  శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ  260 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న భారీ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాస్త్రోక్తంగా నిర్వహించి  శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ   ప్రాజెక్టును కేవలం రెండున్నరేళ్ల కాలపరిమితిలోనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

ఈ   ప్రాజెక్టును మొత్తం రెండు విడతల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత పనుల కోసం  140 కోట్ల రూపాయలు కేటాయించారు.  మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఆంజనేయస్వామి ఆలయం,  పుష్కరిణి , అలాగే ఆలయ పరిసరాల అంతటా సుందరమైన కట్-స్టోన్ ఫ్లోరింగ్ పనులను ఈ విడతలో పూర్తి చేయనున్నారు. అమరావతి నగరానికి వచ్చే భక్తులకు తిరుమల దివ్య క్షేత్రాన్ని దర్శించిన అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్మాణ శైలి ఉండ నుంది. 

ఇక రెండవ విడత పనుల కోసం రూ. 120 కోట్లను కేటాయించి భక్తుల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా తిరుమల కొండ తరహాలోనే ఇక్కడ కూడా ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆలయానికి అనుసంధానంగా ఉండే ప్రధాన రహదారులను విస్తరించనున్నారు. వేలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాద వితరణ చేసేందుకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన భారీ అన్నదానం కాంప్లెక్స్, అలాగే భక్తులకు   వసతి గృహాలు,  ఆలయ అర్చకులు,   ఇతర సిబ్బంది నివాస సముదాయాలను నిర్మించనున్నారు. 

వాస్తవానికి  2019 కంటే ముందే కృష్ణా నది తీరాన దాదాపు 25.4 ఎకరాల సువిశాల స్థలంలో తిరుమల ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి భూమిని కేటాయించింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించి, పనులను దాదాపు నిలిపివేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను మళ్లీ వేగవంతం చేసి, అమరావతిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు ఈ భారీ విస్తరణ ప్రణాళికను పునరుద్ధరించారు. రాజధాని అమరావతిని దైవసంకల్పంతో కూడిన నగరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభివర్ణించారు.  

Amaravati TTD Temple, Sri Venkateswara Swamy Temple Amaravati, Chandrababu Naidu Temple Foundation

google-ad-img
    Related Sigment News
    • Loading...