పులి సంచారంతో భయంభయం

posted on: Apr 5, 2026 9:12AM

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నది. గత కొన్ని రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా. అయితే మనుషులను చూస్తే సాధారణంగా పులులు వయలెంట్ అవుతాయి. కానీ ఈ పులి మాత్రం మనుషులను చూసి నెమ్మదిగా వెనక్కు పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. పులి అడుగుజాడల ఆధారంగా అది ఎటువైపు వెళ్తుందో పర్యవేక్షిస్తున్నారు. పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ప్రజల రక్షణ దృష్ట్యా అటవీశాఖ అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.   పొలం పనులకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. సాయంత్రం వేళల్లో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. పశువులను అడవి వైపు తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.  గండి పోచమ్మ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వీలైనంత త్వరగా పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...