ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
posted on: Jan 31, 2026 12:23PM
.webp)
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నగర శివారులోని చర్లపల్లి- ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను బోడుప్పల్ లోని హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, ఆమె కుమార్తె చేతన, కుమారుడు విశాల్గా గుర్తించారు. తల్లి ఇద్దరు పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది.
మృతురాలు విజయశాంతి రెడ్డి కూతురు చేతన ఇంటర్ రెండో సంవత్సరం, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విజయశాంతి రెడ్డి భర్త దగ్గర లేరు. వీరి ఆత్మ హత్యకు కారణాలేమిటన్నది తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యావంతురాలు, ఉద్యోగంలో స్థిర పడిన మహిళ పిల్లలతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడటం వెనుక కారణాలేంటన్న దానిపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. మృతురాలు విజయశాంతి రెడ్డి, తన తల్లి తో కలిసి చర్లపల్లి ప్రాంతంలో నివాసం ఉంటుంది. విజయ భర్త సురేందర్రెడ్డి ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటున్నట్లు గుర్తించారు. గత నాలుగు నెలలుగా ఆయన భారత్కు రాలేదని కుటుంబ సభ్యులు పోలీసు లకు తెలిపారు. విజయ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తూ ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లు ఆమె తల్లి వెల్లడించారు.
ఘటనకు ముందు రోజు సాయంత్రం విజయ తన ఇద్దరు పిల్లలను కాలేజీ నుంచి ఇంటికి తీసుకొచ్చిం దని, ఆ సమయంలో ఎలాంటి అసహజ ప్రవర్తన కనిపించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తెల్లవారుజామున పిల్లలను వెంటబెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరిన విజయ నేరుగా చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు నిర్ధారించారు. ఆ తరువాత వేగంగా వెళ్తున్న రైలుకు ఎదురెళ్లి పిల్లలతో కలిసి విజయ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ఘటనపై విజయ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కుటుంబమంతా అన్యోన్యం గానే ఉంటామని ఆమె తెలిపారు. విజయ ఉద్యోగం లో మంచి స్థాయిలో ఉందని, పిల్లల చదువుపై కూడా శ్రద్ధ వహించేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలతో కలిసి విజయ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని విజయ తల్లి వాపోయారు. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సమస్యలున్నాయా? మానసిక ఒత్తిడి ఏమైనా ఉందా? భర్త దూరంగా ఉండటం వల్ల వ్యక్తిగతంగా ఎదురైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? అన్న అంశాలపై విచారణ చేస్తున్నారు.ఈ క్రమంలోనే పోలీసులు విజయ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, సందేశాలను పరిశీలిస్తు న్నారు. అలాగే స్నేహితులు, సహోద్యోగులు, బంధువుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.



.webp)


