తుళ్ళూరులోఆ పాడు పని చేసిందెవరో?
posted on: Dec 29, 2014 2:43PM
.jpg)
తుళ్ళూరు మండలంలో లింగాయపాలెం, పెనుమాక, ఉండవల్లి, మందడం గ్రామాల ప్రజలు రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ గ్రామాలలో అరటి తోటలను, షెడ్లను, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు నిప్పు పెట్టడంతో ఆ గ్రామస్తులలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ సంగతి తెలిసిన వెంటనే జిల్లా అర్బన్ యస్పీ రాజేష్ కుమార్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆయన జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. ఇటువంటి ఘటనల వలన ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నందున బాధ్యులను గుర్తించేందుకు తక్షణమే చర్యలు చెప్పట్టాలని అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ అథారిటీ సి.ఈ.ఓ.గా నియమితులయిన శ్రీకాంత్ తక్షణమే స్పందిస్తూ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి పరిస్థితిని సమీక్షించారు. దీనిపై విచారణ జరిపి ఇందుకు బాధ్యులయిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు ఆ గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారు కనుక, సహజంగానే అందరూ తెదేపా నేతల హస్తం ఉందని అనుమానించవచ్చును. అయితే అధికారంలో ఉన్న తెదేపా ఇటువంటి పనులకు పాల్పడుతుందని భావించలేము. ఎందుకంటే దానివల్ల అందరూ దానినే అనుమానించే అవకాశం ఉంది. బహుశః ఇదే ఆలోచనతోనే దానిని వ్యతిరేకిస్తున్న వారెవరయినా చేసి ఉండవచ్చు. ఏమయినప్పటికీ పోలీసులు అసలయిన నిందితులను పట్టుకొని కోర్టులో నిలబెడితే తప్ప ఎవరినీ అనుమానించడానికి లేదు.



.jpg)
.jpg)

.webp)



