టీమ్ స్పిరిట్ అంటే ఇదీ!
posted on Nov 1, 2025 1:19PM
.webp)
మొంథా తుఫాన్ను టీమ్ స్పిరిట్తో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. శనివారం (నవంబర్ 1) తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మొంథా తుపాన్ ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రిపాల్గొన్నారు. మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన 137 మందికి మెమొంటోలు, సర్టిఫికెట్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. ప్రతీ సంక్షోభాన్నీ అవకాశంగా తీసుకోవాలన్న ఆయన మొంథా తుపాను నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడంలో విశేష కృషి చేసిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అద్భతంగా పనిచేశారన్నారు. మొంథా తుపానును ఎదుర్కొన్న అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్గా రూపొందిద్దామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్తుందనే దానికి నిదర్శనమే మొంథా తుఫాన్ నష్టాన్ని భారీగా తగ్గించిన మనపనితనమని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రానికి రాయలసీమకు కరువు, కోస్తాంధ్రకు తుఫాన్లు రెండు ప్రధాన సమస్యలన్న చంద్రబాబు.. సమర్ధ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో రాయలసీమలో కరువు అనేది లేకుండా చేయగలిగామనీ, ఈసారి మొంథా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక టీమ్ ను సిద్ధం చేశామనీ, ఆ బృందం అద్భుతంగా పని చేసిందనీ చెప్పారు. అధికారులకు సాంకేతిక సపోర్టును ఇచ్చామనీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నామనీ చంద్రబాబు పేర్కొన్నారు. మోనిటరింగ్, అలెర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహాబిలిటేషన్, నార్మల్సీ.., ఇలా ఫైవ్ పాయింట్ ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించామన్నారు. అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్లోనే హెచ్చరికలు పంపించామన్నారు. వర్ష ప్రభావం, గాలులు తీవ్రత ఇలా అన్నింటినీ టెక్నాలజీతో పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామనీ, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పిన ఆ్యన అతి పెద్ద తుఫాన్ను నుంచి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చేయడంలో విజయం సాధించామన్నారు.
డ్రోన్ల ద్వారా తుఫానులో చిక్కకున్నవారి ప్రాణాలు కూడా కాపాడామనీ, పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని, ఓ ప్రార్ధనామందిరంలో చిక్కుకున్న 15 మందిని కూడా కాపాడగలిగామనీ చెప్పారు సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్న చంద్రబాబు శాటిలైట్లు, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి అలెర్టులు పంపించామన్నారు. ముందస్తు జాగ్రత్తగా కాలువల పూడికలు, అడ్డంకులు తొలగించడంతో భారీ వర్షాలు కురిసినా నీరు అంతా కిందికి సులువుగా ప్రవహించి వరద ముప్పు తగ్గిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్ర స్థాయిలో అందరినీ అప్రమత్తం చేసి రక్షణగా నిలిచారని కితాబిచ్చారు. సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ అంతా కలిసి ప్రజలను కాపాడటంలో సఫలీకృతమయ్యారని అభినందించారు. ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు అందరూ బాగా పని చేశారని ప్రశంసించారు. అంతా కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చేసి చూపించాం. బాగా పనిచేసిన వారిని గుర్తించి అందరికీ స్పూర్తిని చాటాలనే ఈ కార్యక్రమం నిర్వహించామని చంద్రబాబు చెప్పారు. ప్రజలు కూడా ఈ స్పూర్తిని అందిపుచ్చుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
అలాగే, గతంలో ఏ అంశం చెప్పాలన్నా గ్రామాల్లో టాంటాం వేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా హెచ్చరికలు పంపామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో రాజధాని నుంచే గ్రామ స్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, మంత్రులు అనిత, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.