అమెరికా వీసా నిబంధనల ఉచ్చు: లక్ష డాలర్ల భారం.. హెచ్-1బి నిపుణులకు తప్పని తిప్పలు

posted on: May 1, 2026 3:37PM

అగ్రరాజ్యం అమెరికాలో కొలువు సాధించాలనే విదేశీ నిపుణుల ఆకాంక్షలపై ప్రస్తుత ట్రంప్ యంత్రాంగం పిడుగు లాంటి వార్త వినిపించింది. హెచ్-1బి వీసా ప్రక్రియను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినతరం చేస్తూ ప్రవేశపెట్టిన నూతన నిబంధనలు వలసదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారీగా పెంచిన దరఖాస్తు రుసుము, వేతన ప్రాధాన్యత ఆధారిత ఎంపిక విధానం వల్ల అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అమెరికా  కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ సంస్కరణలు ఐటీ, సాంకేతిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.  

ట్రంప్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్ నుండి అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం, అమెరికా వెలుపల నుండి దరఖాస్తు చేసుకునే కొత్త అభ్యర్థులు  ఒక లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు   83 లక్షల రూపాయలు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి రావడంతో విదేశీ అభ్యర్థులను నియమించుకోవడానికి కంపెనీలు బెంబేలెత్తుతున్నాయి. దీని ఫలితంగా గడిచిన కొద్ది నెలల్లోనే హెచ్-1బి దరఖాస్తుల సంఖ్య ఏకంగా 87 శాతం పడిపోయింది.  2026 ఫిబ్రవరి నాటి అధికారిక లెక్కల ప్రకారం..  ఇంతటి భారీ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కేవలం 85  మాత్రమే. 

ఇక వీసా ఎంపిక విధానంలో కూడా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. గతంలో అమలులో ఉన్న  లాటరీ పద్ధతికి స్వస్తి పలికి, ఇప్పుడు వేతన స్థాయిల ఆధారంగా (Wage-weighted selection) వీసాలను కేటాయిస్తున్నారు. అంటే, అత్యధిక వేతనం పొందే నైపుణ్యం కలిగిన నిపుణులకు (లెవెల్ 3, లెవెల్ 4) మాత్రమే వీసా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న యువ గ్రాడ్యుయేట్లు, తక్కువ వేతనంతో అమెరికాలో అడుగుపెట్టాలనుకునే ఎంట్రీ లెవల్ ఉద్యోగుల ఆశలు దాదాపు గల్లంతైనట్లే.  మరోవైపు, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు  ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' పేరిట ప్రభుత్వం నిఘా  తీవ్రతరం చేసింది.  కంపెనీలు ఫేక్ డాక్యుమెంట్లతో వీసాలు పొందుతున్నాయా లేదా అనే అంశంపై కార్మిక శాఖ దర్యాప్తులు 48 శాతం మేర పెరిగాయి. అధికారులు పని ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు  నిర్వహిస్తూ..  దరఖాస్తులో పేర్కొన్న జీతభత్యాలు ఉద్యోగికి అందుతున్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే కంపెనీలను తక్షణమే బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు తోడుగా.. అమెరికాలోని పలు కీలక రాష్ట్రాలు కూడా విదేశీ ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తున్నాయి. రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాలు స్థానిక నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాయి. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక అడుగు ముందుకు వేసి..  2027 మే వరకు ప్రభుత్వ సంస్థల్లో విదేశీయులను నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.  స్థానిక పన్ను దారుల నిధులతో నడిచే ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్నది వారి వాదన.  ఫ్లోరిడా కూడా తన యూనివర్సిటీల్లో కొత్త హెచ్-1బి నియామకాలపై ఏడాది పాటు నిషేధం విధించింది.  ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం హెచ్-1బి వీసాపైనే ఆశలు పెట్టుకోకుండా ఎల్-1, ఓ-1 లేదా స్టెమ్ ఆప్ట్   వంటి ఇతర వీసా కేటగిరీలను పరిశీలించడం ఉత్తమమని చెబుతున్నారు. అలాగే..  కంపెనీలు ఇచ్చే పత్రాలలో చిన్న పొరపాటు ఉన్నా వీసా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉన్నందున, నిపుణులైన ఇమ్మిగ్రేషన్ లాయర్ల సలహాలు తీసుకోవడం అనివార్యంగా మారింది.  మునుముందు అమెరికా వలస విధానాలు మరింత క్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం చౌక కార్మికుల కోసం కాకుండా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించాలనే ట్రంప్ సర్కార్ పట్టుదల రాబోయే కాలంలో ప్రపంచ ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. లక్ష డాలర్ల ఫీజు అనేది విదేశీ మేధావుల రాకను అడ్డుకునే ఒక బలమైన గోడలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

- సీతారాం కంఠంనేని

References

 Newsweek Analysis on H-1B Visa Odds (2026).
 U.S. Citizenship and Immigration Services (USCIS) Statements (2025-26).
 DHS Court Filings on Fee Revenue and Application Statistics.
 Executive Orders from Florida and Texas Governors (2025).
 Labor Department "Project Firewall" Investigation Reports.

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే https://www.teluguone.com ఫాలో అవ్వండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...