ఇరాన్ యుద్ధం నేర్పిన పాఠం.. భద్రత, ఆర్థిక రంగాల్లో యూఏఈ ప్రక్షాళన

posted on: Apr 22, 2026 10:31AM

ఇరాన్   అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతాన్ని అశాంతికి గురిచేయడమే కాకుండా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా మార్చివేస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికా రక్షణ కవచంలో ఉన్న యూఏఈ..  ఇప్పుడు తన భద్రతా అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలపై పునరాలోచనలో పడింది.  ముఖ్యంగా ఇరాన్ యుద్ధ ప్రభావం తర్వాత.. అబుదాబి తన దౌత్య, ఆర్థిక  విధానాలను మార్చుకుంటూ చైనాకు దగ్గరయ్యేలా  అడుగులు వేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు యూఏఈకి రక్షణకా? భారమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  గత కొంతకాలంగా అమెరికా దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల తమకు చేకూరే ప్రయోజనం కంటే పొంచి ఉన్న ముప్పే ఎక్కువగా ఉందని యూఏఈ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం యూఏఈ గడ్డపై   3,500 మంది అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే..  ఇరాన్ జరిపిన డ్రోన్,  క్షిపణి దాడుల సమయంలో అమెరికా స్థావరాల కంటే యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలే సమర్థవంతంగా పనిచేయడం విశేషం. దీంతో అల్ ధఫ్రా వంటి భారీ అమెరికా సైనిక స్థావరాలు దేశానికి ఆస్తిగా కాకుండా.. శత్రువుల దాడులను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది. 

ఇరాన్ దాడుల కారణంగా యూఏఈ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. వందలాది క్షిపణులు, డ్రోన్ల దాడి వల్ల దేశ మౌలిక సదుపాయాలు చిన్నాభిన్నమయ్యాయి. దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లు భారీగా పతనమై సుమారు 120 బిలియన్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది.  విమానయాన రంగంపై కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.   దాదాపు 18 వేల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో  పాటు పారిశ్రామిక కేంద్రాలు, పెట్రోకెమికల్ యూనిట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దురదృష్టవశాత్తూ ఈ ఘర్షణల్లో పౌరులు, సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు యూఏఈ ఆర్థిక సుస్థిరత ఎంతటి ప్రమాదంలో ఉందో ప్రపంచానికి చాటిచెప్పాయి. 

ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో  కరెన్సీ స్వాప్ లైన్ మద్దతు లభించకపోవడం కూడా యూఏఈని పునరాలోచనలో పడేసింది.  సాధారణంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థలకే ఇటువంటి సదుపాయం కల్పించే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిబంధనల వల్ల యూఏఈకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే యూఏఈ  డీ-డాలరైజేషన్ అంటే డాలర్ రహితీకరణ దిశగా అడుగులు వేస్తోంది.  చమురు వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ  యువాన్ ను వాడటం ద్వారా డాలర్ ఆధిపత్యానికి స్వస్తి పలకాలని యూఏఈ యోచిస్తోంది. 

గల్ఫ్ దేశాల్లో మారుతున్న ఈ పరిస్థితులను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇరాన్, అమెరికా ఘర్షణల వల్ల ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు బీజింగ్ సిద్ధమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అబుదాబి యువరాజుతో జరిపిన చర్చల్లో  చారిత్రాత్మక మార్పుల' గురించి ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. ఇంధన, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా భాగస్వామ్యం పెరుగుతుండటం వల్ల భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పట్టు సడలే అవకాశం కనిపిస్తోంది. 

ఇరాన్ యుద్ధం నేర్పిన పాఠాలతో యూఏఈ ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటోంది. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా చైనా, ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా.. భద్రత, ఆర్థిక రంగాల డైవర్సిఫికేషన్ అత్యవసరమని భావిస్తోంది. రాబోయే రోజుల్లో యూఏఈ కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాకుండా..అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక స్వతంత్ర నిర్ణయాధికార దేశంగా ఎదిగేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి.  అమెరికా సైనిక నీడ నుంచి బయటకు వచ్చి.. సొంత రక్షణ,  ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే యూఏఈ తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది.

-సీతారాం కంఠమనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...