బాలీవుడ్ నటికి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు..?

posted on: Jun 18, 2016 3:23PM

బాలీవుడ్‌కు అండర్‌వరల్డ్‌కు ఉన్న సంబంధం గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులకు, మాఫియా డాన్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే చీకటి వ్యాపారులతో చీకటి వ్యాపారం చేసినట్లు కూడా ఎన్నోసార్లు రుజువయ్యింది. అలా మాఫియాతో చేతులు కలిపి వేలకోట్ల ఆస్తులు వెనకేయాలని చూసిన అలనాటి బాలీవుడ్ నటి మమతా కులకర్ణీ పోలీసులకు చిక్కడంతో హిందీ చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. థానే కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు ఒకేసారి 18.5 టన్నుల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2 వేల కోట్లకు పైమాటేనని నిపుణులు తేల్చారు. దేశ నేర చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టబడటం ఇదే మొదటిసారి.

 

ఈ కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. డ్రగ్స్ మాఫియా మూలాలు ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఉన్నట్లు గుర్తించారు. దీనికి సూత్రధారులుగా అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ విక్కీ గోస్వామి అతని భార్య అలనాటి అందాల తార మమతా కులకర్ణీలని తేలడంతో బాలీవుడ్ స్టన్నయ్యింది.

 

అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని మమత వాదిస్తోంది. విక్కీ కూడా మమత తన భార్య కాదని చెప్పాడు. కానీ మమత అమాయకురాలు కాదని, మాదకద్రవ్యాల సరఫరా విషయంలో ఆమె పాత్ర కూడా ఉందని పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. అందుకే ఆమెను నిందితుల జాబితాలోకి చేర్చడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌ను కోరతామని థానే పోలీసులు ప్రకటించారు. మమతా డ్రగ్స్‌ను సరఫరా చేయడానికి కొందరు బాలీవుడ్ ప్రముఖుల సహాయం తీసుకున్నారని, ఆ సెలబ్రిటీలను ఇప్పటికే విచారించామని పోలీసులు చెప్పడంతో ఆ ప్రముఖులు ఎవరై ఉంటారా..? అని జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...