తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

posted on: Apr 8, 2026 7:57PM

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటివరకు ప్రమాద మరణాలకు మాత్రమే వర్తించిన బీమా సౌకర్యాన్ని విస్తరించి, ఇకపై సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.

యూనియన్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఉన్న ఆర్టీసీ ఉద్యోగి సహజ మరణం చెందిన పక్షంలో, వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందజేయనుంది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. ముఖ్యంగా, ఈ బీమా కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం ప్రీమియంను బ్యాంకే భరిస్తుంది.

ఇప్పటికే అమల్లో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు సహజ మరణ బీమా కూడా చేరడంతో ఉద్యోగుల సామాజిక భద్రత మరింత బలపడనుంది.

సంస్థ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ చర్యతో సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38 వేల మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతిస్తూ, తమ కుటుంబాలకు ఇది పెద్ద రక్షణగా మారుతుందని పేర్కొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...