Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీజీ20 లీగ్ వేలంలో కాసుల వర్షం...రికార్డు ధరకు తిలక్ వర్మ
posted on: Jun 7, 2026 4:53PM

డీజీపీ సీవీ ఆనంద్ తనయుడికి రూ.17 లక్షలు..
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. స్థానిక ఆటగాళ్లలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్' తొలి సీజన్ ఆటగాళ్ల వేలం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజే ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై భారీగా డబ్బులు కురిపించాయి. ఈ వేలంలో టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ ఊహించని రీతిలో రికార్డు ధర పలికి హాట్ టాపిక్గా మారాడు.
రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రిన్సెస్ కన్వెన్షన్ సెంటర్లో దేశంలోనే ప్రముఖ ఆక్షనీర్ చారు శర్మ నేతృత్వంలో ఈ వేలం ప్రక్రియ ఎంతో ప్రొఫెషనల్గా సాగింది. ఐకాన్ ఆటగాళ్ల విభాగంలో ఉన్న తిలక్ వర్మను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు 'మెదక్ ఫాల్కన్స్' జట్టు ఏకంగా రూ.33 లక్షల భారీ మొత్తాన్ని వెచ్చించి తిలక్ వర్మను తమ సొంతం చేసుకుంది. ఈ లీగ్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డు ధర కావడం విశేషం.
మరోవైపు టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను 'వరంగల్ వారియర్స్' ఫ్రాంచైజీ రూ.14 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సిరాజ్ కంటే.. దేశవాళీ టోర్నీల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ పేసర్ సి.వి. మిలింద్ ఎక్కువ ధర పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మిలింద్ను 'అన్విత ఖమ్మం ఏసెస్' జట్టు ఏకంగా రూ.17 లక్షల భారీ ధరకు దక్కించుకుంది.
ఈ వేలంలో ఇతర ఆటగాళ్లకు కూడా మంచి డిమాండ్ లభించింది. రవికిరణ్ను పాలమూరు స్ట్రైకర్స్ రూ.13 లక్షలకు కొనుగోలు చేయగా, రవితేజను మెదక్ జట్టు రూ.12 లక్షలకు, అమన్ రావును వరంగల్ వారియర్స్ రూ.12 లక్షలకు దక్కించుకున్నాయి. అలాగే తనయ్ త్యాగరాజన్, ప్రగ్యాన్ రెడ్డి, అజయ్దేవ్ గౌడ్, మహ్మద్ ఆర్ఫాజ్ అహ్మద్, అభిరత్ రెడ్డి వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు రూ.11 లక్షల చొప్పున ధర పలికింది. మరో సీనియర్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ను కరీంనగర్ డైమండ్స్ రూ.8 లక్షలకు దక్కించుకుంది.
ఈ మెగా లీగ్ కోసం దాదాపు 1300 మందికి పైగా హెచ్సీఏ రిజిస్టర్డ్ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా, తుది వడపోత తర్వాత 160 మంది ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ వేలంలో తలపడుతుండగా.. ప్రతి జట్టుకు ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.60 లక్షల పర్స్ లిమిట్ను కేటాయించారు. ఐకాన్ ప్లేయర్ల కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ జట్ల మధ్య జరిగిన బిడ్డింగ్ వార్ వేలంలో అసలైన మజాను అందించింది.
తెలంగాణ ఐపీఎల్గా భావిస్తున్న ఈ లీగ్ స్థానిక యువ క్రికెటర్లకు ఒక అద్భుతమైన వేదిక కానుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల యువతలో దాగున్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని హెచ్సీఏ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వేలంలో ఆటగాళ్లకు లభించిన ఆదరణ చూస్తుంటే ఈ లీగ్ సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తం 8 జట్ల మధ్య 21 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్లో 32 మ్యాచ్లు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ రసవత్తర పోరాటాలకు వేదిక కానుంది. ఈ లీగ్ ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి మరికొంత మంది నయా సంచలనాలు భారత జట్టులోకి దూసుకురావాలని క్రీడాభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.






