Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉగ్రపడగ నీడలో దక్షిణాసియా!
posted on: Apr 26, 2026 9:04AM

భారత ఉపఖండంలో భద్రతాపరమైన సవాళ్లు రోజురోజుకూ పెరిగిపోవడమే కాకుండా అత్యంత సంక్లిష్టంగా కూడా మారుడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే లష్కరే తొయిబా (ఎల్ఈటీ), జైషే మహమ్మద్ (జేఈఎమ్) వంటి ఉగ్ర సంస్థల కార్యకలాపాలు ఈ ప్రాంతంలోని దేశాల మధ్య సంబంధాలను, శాంతిని దెబ్బతీస్తున్నాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇండియా లక్ష్యంగా సాగుతున్న కేంద్రంగా సాగుతున్న పరోక్ష ( ప్రాక్సీ) యుద్ధవ్యూహాలు దక్షిణాసియా భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా.. దక్షిణాసియా మొత్తంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించడంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఎల్ఈటీ, జేఈఎమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఈ ఉగ్ర ముఠాలు అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడుతున్నాయి.
గత మూడు దశాబ్దాల్లో జరిగిన కీలక సంఘటనలను పరిశీలిస్తే, ఎర్రకోటపై దాడి, ముంబై దాడులు వంటి ఘోరమైన దాడుల వెనుక ఎల్ఈటీ, జేఈఎమ్ ఉగ్ర సంస్థల హస్తం ఉంది. ముఖ్యంగా జేఈఎమ్ ఇటీవల కాలంలో భారత భూభాగంలోకి చొరబాట్లను అధికం చేసింది. సరిహద్దుల నుంచి నిరంతరం ఉగ్రవాదులను పంపిస్తూ దేశంలో అస్థిరత సృష్టించేందుకుఈ ఉగ్ర సంస్థ ప్రయత్నిస్తున్న తీరు భారత భద్రతా దళాలకు సవాలు గా మారింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలకు అక్కడి గూఢచారి సంస్థల మద్దతు లభిస్తోందన్నది బహిరంగ రహస్యం. ఉగ్రవాదాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా మలుచుకుని భారత ప్రతిష్టను దెబ్బతీయాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. కాగా ఈ ఉగ్ర సంస్థలకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగినప్పటికీ డిజిటల్ మార్గాల ద్వారా నిధుల సేకరణ, కొత్త శిక్షణ కేంద్రాలను ఏర్పాటు ద్వారా నెట్వర్క్ను పునర్నిర్మించుకోవడమే కాకుండా విస్తరించుకుంటున్నాయి.
ఈ పరిస్థితే.. భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియకు విఘాతంగా మారడమే కాకుండా ఇరు దేశాల మధ్య నిరంతరం యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. ఇప్పుడు, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదం కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు. ఎల్ఈటీ, జేఈఎమ్ సంస్థలు తమ నెట్వర్క్ను ఆసియా దాటి యూరప్, ఉత్తర అమెరికాలకు కూడా విస్తరించడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇందుకు అనుగుణంగా ఇండియా కూడా తన రక్షణ వ్యూహాలను మార్చుకుంది.
సరిహద్దుల వెంబడి పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా.. ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడానికీ ఇండియా వెనుకాడటం లేదు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలపై ఒత్తిడి తీసుకురావడంలో భారత్ విజయం సాధిస్తోంది. . మరోవైపు, ఐబీఎస్ఏ (ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) వంటి కూటముల ద్వారా ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియా తన వాణిని బలంగా వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి జాబితాలోని ఉగ్రవాదులపై ఆంక్షలు విధించేలా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో భారత దౌత్యం సక్సెస్ అయ్యింది.
భారతదేశం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలను బహుళపాక్షిక వేదికలపై సమర్థవంతంగా వినిపించడం ద్వారా.. ప్రపంచ దేశాలు కూడా ఉగ్రముప్పును గుర్తించేలా చేసింది. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్కు అంతర్జాతీయ సహకారం పెరిగేందుకు ఇది దోహదం చేసింది. చేస్తోంది. ఎఈటీ, జేఈఎమ్ ల మధ్య అంతర్గత విభేదాల కారణంగా.. ఆయా సంస్థల నుంచే కీలక సమాచారం లీక్ అవుతోంది. ఈ పరిస్థితి ఇండియా తన ఉగ్రపోరుపై విజయం సాధించడంలో ఎంతో ఉపయుక్తంగా మారింది. భవిష్యత్తులో భారత ఉపఖండ భద్రత ఈ ఉగ్ర ముఠాల అణచివేతపైనే ఆధారపడి ఉంటుందనడంలో ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. సరిహద్దుల్లో శాంతిని కాపాడటం, ఉగ్రవాద మూలాలను పెకిలించడం మొత్తంగా దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలకు అత్యంత కీలకం. అంతర్జాతీయ సమాజం మద్దతుతో భారత్ ఈ దిశలో ముందుకు సాగుతున్నది.
- సీతారాం కంఠంనేని






