తెలుగుదేశం మహానాడుకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా?

ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కార్యకర్తల పార్టీయే. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీకి అండగా కార్యకర్తలు నిలబడి పార్టీని నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తొలి నుంచీ కార్యకర్తల సంక్షుమానికే పెద్ద పీట వేస్తూ వస్తున్నది అనడంలో సందేహం లేదు. 

పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ, విపక్షంలో ఉన్నప్పుడూ కూడా పార్టీ అధినాయకత్వం కార్యకర్తల పక్షానే నిలబడింది.  సాధారణంగా రాజకీయ పార్టీలు కార్యకర్తల గురించి ఆలోచించేదీ, మాట్లాడేదీ పార్టీ అధికారంలో లేని సమయంలో మాత్రమే. ఆ పద్ధతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భిన్నంగానే ఉంది.  పార్టీ మనుగడ, ఉనికికి కార్యకర్తలే ప్రధానమని భావిస్తూ వచ్చింది.  

ఇందుకు తజా నిదర్శనం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ కడప వేదికగా నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడుకు తొలి ఆహ్వానం పార్టీ కార్యకర్త కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడమే. అది కూడా పార్టీ కోసం ప్రాణాలను త్యాగం చేసిన తోట చంద్రయ్య కుటుంబానికి మహానాడుకు తొలి ఆహ్వానం అంద జేయాలని నిర్ణయించింది. ఆ ఆహ్వానం కూడా  ఏ స్థానిక నేతతోనో పంపించడం కాకుండా.. మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా చంద్రయ్య ఇంటికి వెళ్లి అందజేయాలని నిర్ణయించుకున్నారు.  

చంద్రయ్య ఎవరో కాదు. పార్టీలో సామాన్య కార్యకర్త. తన చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఆ పార్టీ కోసమే పని చేశారు. జగన్ రాక్షస పాలన సాగుతున్న కాలంలో వైసీపీ గూండాల చేతిలో హతమయ్యారు. చంద్రయ్య తెలుగుదేశం జెండా మోయడమే వైసీపీ గూండాలు ఆయనను హత్య చేయడానికి కారణం. 
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన తోట చంద్రయ్య 2022 జనవరి 13న స్థానిక వైసీపీ నేతలు అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశారు. గొంతు కత్తిమీద పెట్టి జై జగన్, జై వైసీపీ అంటే వదిలేస్తామన్నా కూడా చంద్రయ్య నోటి వెంట జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న నినాదమే వచ్చింది.దీంతో వైసీపీ   మూకలు ఆయనను అత్యంత పాశవికంగా హత్య చేశాయి. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. చంద్రబాబు స్వయంగా తోట చంద్రయ్య అంత్యక్రియలకు హాజరై, ఆయన పాడె మోశారు.  

ఇప్పుడు కడపలో నిర్వహించనున్న మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో నిర్వహించనున్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పండుగకు ఆహ్వాన పత్రికలు రెడీ అయ్యాయి. మొదటి ఆహ్వాన పత్రికను పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా గుండ్లపాడు గ్రామానికి వెళ్లి తన స్వహస్తాలతో తోట చంద్రయ్య కుటుంబాన్ని మహానాడుకు ఆహ్వానిస్తారు.  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమనీ, అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడటం తన కర్తవ్యమనీ లోకేష్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆ చెప్పడం మాటల వరకే పరిమితం కాదనీ, చేతలు కూడా అలాగే ఉంటాయనీ మరోసారి పార్టీ  కార్యకర్త కుటుంబానికి మహానాడు తొలి ఆహ్వానాన్ని అందించడం ద్వారా రుజువు చేస్తున్నారు నారా లోకేష్.