చంద్రబాబుకు ఈ చెత్త అవసరమా?

posted on: Dec 23, 2014 1:44PM



తెలుగుదేశం పార్టీలోకి చెత్త వచ్చి చేరుతోంది. అవును... నిజంగానే చెత్త. ఎందుకూ పనికిరాని చెత్త వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతోంది. ఈ చెత్తవల్ల తెలుగుదేశం పార్టీ కలుషితమైపోవడం తప్ప ప్రయోజనం ఏమీ వుండదు. అయినప్పటికీ, చంద్రబాబుకు ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ చెత్తని పార్టీలో చేరనిస్తున్నారు. ఇతర పార్టీలతో అవసరాలు తీరిపోయి, అవకాశాలు లేకుండా వున్న ‘స్క్రాప్’ అదను చూసుకుని తెలుగుదేశం పార్టీలో కలసిపోవడానికి సిద్ధంగా వుంది. కొంత చెత్త ఇప్పటికే కలసిపోయింది. ఈ పరిణామం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి తెలిసీ జరగడమే పార్టీ శ్రేణులకు ఆవేదన కలిస్తోంది. ఈ చెత్తంతా తెలుగుదేశం పార్టీకి అవసరమా అని వారందరూ ఆవేదన చెందేలా చేస్తోంది.


తెలుగుదేశం పార్టీ పదేళ్ళు అధికారానికి దూరంగా వుంది. ఈ పదేళ్ళ కాలంలో అధికారమే పరమావధిగా భావించిన అనేక మంది స్వార్థపరులైన నాయకులు తెలుగుదేశం పార్టీని విడిచి పోయారు. కష్టకాలంలో అండగా నిలవకుండా దూరమైపోవడమే కాదు... ఇతర పార్టీల్లో చేరి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బొడ్డుకోసి పేరు పెట్టిన గోదావరి జిల్లాకి చెందిన ఓ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో హోదాలు అనుభవించారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో జంప్ జిలానీలా మారిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని తిట్టని తిట్టు లేదు. ఇప్పుడు మళ్ళీ నానా తంటాలు పడి, ఎన్నెన్నో రికమండేషన్లు చేయించుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూల నుంచి ఆ మూల వరకు కాంగ్రెస్, వైసీపీలకు చెందిన ఎంతోమంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి తహతహలాడుతున్నారు. వీళ్ళంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంతో నష్టం చేసినవాళ్ళే. అలాంటి ‘చెత్త’ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి మళ్ళుతూ వుండటం ఇంతకాలం పార్టీని భుజాలమీద మోసిన నాయకులు, కార్యకర్తలకు ఆవేదన కలిగిస్తోంది.


చెరువులో నీరు వస్తే చేరే కప్పల్లాగా తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్న వారిని చంద్రబాబు నాయుడు ఆదరించడం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో  వ్యక్తమవుతోంది. వీరంతా పార్టీకి గతంలో ద్రోహం చేసిన వారు, భవిష్యత్తులో నష్టం చేసేవారే తప్ప ఉపయోగపడేవారు కాదన్న ఆవేదనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చేవారిలో కొంతమంది ఉత్తములు, పార్టీకి ఉపయోగపడేవారూ లేరని కాదు.. అయితే ఎందుకూ పనికిరాని వాళ్ళే ఎక్కువగా వుండటం గమనార్హం. అందువల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని, అవినీతిపరులను, వివాదాస్పదమైన వ్యక్తులను పార్టీలోకి తీసుకోకపోవడం మంచిదన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి పార్టీని ద్రోహుల నుంచి కాపాడాలని కోరుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...