జగన్ గ(క)డపలో టీడీపీ పాగా..?

posted on: Jul 25, 2016 3:46PM

కడప..ఈ పేరు చెబితే మొదటగా గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.  ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా వైఎస్‌దే హవా. తన రాజకీయ చతురతతో కాంగ్రెస్‌కు తప్ప మరోపార్టీకి కడపలో స్థానం లేకుండా చేశారు వైఎస్. గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ వైఎస్, ఆయన కుటుంబసభ్యుల మాట వినవలసిందే. ఇక వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం హవా గురించి చెప్పవలసిన అవసరం లేదు. అధికారం అంటే ఎలా ఉంటుందో..అధికారం ఎలా అనుభవించాలో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేసి చూపించారు. జిల్లాకు పవర్ సెంటర్‌లా మారి దాదాపు ప్రతిపక్షాన్ని అణచివేశారు వైఎస్. అలా కడప జిల్లా అంటే కాంగ్రెస్‌కు కంచుకోట అన్నట్లుగా తీర్చిదిద్దారు. అయితే ఆయన అకాల మరణంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

 

కాంగ్రెస్ అధిష్టానం తనను అవమానిస్తోందన్న ఆగ్రహంతో వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి హస్తానికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవ్యాంధ్రలో తెలుగుదేశానికి వైసీపీ ధీటైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా కడపలో ఫ్యాన్ గాలి ముందు సైకిల్ నిలవలేకపోయింది. ఆది నుంచి పట్టున్న జిల్లా కావడం..పైగా సొంత జిల్లా కావడంతో వైసీపీ అధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తం 10 శాసనసభ స్థానాల్లో తొమ్మిదింటిని గెలుచుకుని జగన్ తన ఆధిక్యత చాటారు. అయితే కడపను కంచుకోటగా చేసుకున్న వైసీపీ సామ్రాజ్యంపై తెలుగుదేశం జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ తాజాగా స్థానిక సంస్థల ప్రతినిధులపై దృష్టిసారించింది.

 

ఇప్పటికే కడప, ప్రొద్దుటూరులో వైసీపీ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు సైకిలెక్కారు. ఇక మండల, జిల్లా పరిషత్‌లపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎన్నికలు కూడా జరగనుండటంతో మరిన్ని సమీకరణలు చేపట్టనున్నట్లు సమాచారం. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరడంతో అక్కడ స్థానిక బలం పెరిగింది. బద్వేల్‌లో ఇలాంటి పరిస్థితులపై దృష్టి సారించనున్నారు. మున్సిపాలిటీల్లో సంఖ్యాబలం పెంచుకుంటున్న టీడీపీ కొన్ని చోట్ల ఆ పీఠాలను చేజిక్కించుకునే అవకాశాల కోసం అన్వేషిస్తోంది. ఇందుకు తోడు కొందరు ముఖ్యనేతలు, సీనియర్లుగా ఉన్నవారు టీడీపీ వైపు మొగ్గుచూపుతుండటంతో ఆ పరిస్థితులు తెలుగుదేశానికి కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి చేరిక ఖరారైతే వార్డు స్థాయి నుంచి పార్టీకి మరికొంత  బలం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దగ్గరుండి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

 

లోకేష్ కృషి ఫలితంగానే కడప నగరంలో వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. ఈ నెల 29న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు జిల్లాకు రానుండటంతో సమీకరణాలు మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే తాతల నుంచి వస్తోన్న ఆధిపత్యాన్ని వేరొకరికి ఇవ్వడానికి ఒప్పుకోని జగన్ "ఇజ్జత్ కా సవాల్" అన్న చందంగా సర్వశక్తులు ఒడ్డి టీడీపీపై ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేత వరకు సైకిల్‌ వైపు చూస్తోన్న తరుణంలో జగన్ మాటలు ఎవరూ వినే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమీకరణాలన్నింటి బట్టి కడప గడపలో టీడీపీ పాగా ఖాయంగా కనిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...