Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సనత్ నగర్ టిమ్స్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
posted on: Aug 17, 2026 8:52PM

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్లో పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో సిద్ధం చేసిన సనత్ నగర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రి అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రజాప్రతినిధులతో కలిసి ఈ అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో పాటు స్థానిక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, అక్కడి ఓపీ కౌంటర్లు మరియు వైద్య విభాగాల పనితీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
సుమారు రూ. 1,126 కోట్ల భారీ వ్యయంతో ఈ ఆస్పత్రిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. ఇక్కడ మొత్తం 1,082 పడకలను అందుబాటులోకి తేగా, అత్యవసర చికిత్సల కోసం ప్రత్యేకంగా 300 ఐసీయూ పడకలను సిద్ధం చేశారు. అంతేకాకుండా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు వీలుగా 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు.
ఇన్నాళ్లూ ప్రయోగాత్మకంగా కేవలం సాధారణ ఓపీ సేవలను మాత్రమే అందించగా, ఈ ప్రారంభోత్సవంతో పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ సేవలు రోగులకు అందుబాటులోకి రానున్నాయి. గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్, అవయవ మార్పిడి, అత్యవసర ట్రామా విభాగాలతో కలిపి మొత్తం 37 రకాల ప్రధాన వైద్య విభాగాలు ఇక్కడ కొలువుదీరాయి.
కార్డియాక్, రీనల్, న్యూరో విభాగాల్లో ప్రత్యేక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' కేంద్రాలను నెలకొల్పడంతో పాటు వ్యాధి నిర్ధారణ వేగంగా జరిగేందుకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, అధునాతన ల్యాబ్లను కూడా అనుసంధానించారు. దీనివల్ల నిరుపేద రోగులకు లక్షల రూపాయల ఖరీదైన వైద్యం రూపాయి ఖర్చు లేకుండా లభించనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరం పరిధిలోని గాంధీ, ఉస్మానియా నిమ్స్ ఆస్పత్రులపై తీవ్రమైన రోగుల భారం ఉంది. నగర పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఈ కొత్త టిమ్స్ ఆస్పత్రి ఒక గొప్ప ఊరటగా మారనుంది. గాంధీ, ఉస్మానియాలపై ఉండే ఒత్తిడిని తగ్గించడంలో ఈ పడకల సంఖ్య కీలకంగా మారనుంది.
ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. సనత్ నగర్ టిమ్స్ ద్వారా వేలాది మంది ప్రజలకు ఉచిత మరియు సమగ్రమైన వైద్య సేవలు అందడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్ర వైద్య రంగంలో ఇది ఒక మైలురాయిగా నిలవనుందని నిపుణులు భావిస్తున్నారు.
Telangana TIMS Hospital, Sanath Nagar TIMS Inauguration, CM Revanth Reddy, Hyderabad Healthcare News, Telangana Free Corporate Treatment, Minister Damodar Rajanarsimha


.webp)


