ఆ క్రెడిట్ కోసం ఇంకా కీచులాటలే

 

తెలంగాణా రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచిపోతున్నా దాని క్రెడిట్ కోసం ఇంకా కాంగ్రెస్, తెరాసాలు కీచులాడుకొంటూనే ఉన్నాయి. తెలంగాణా ఇచ్చిన సోనియాగాంధీ ప్రజలకు దేవత అని కాంగ్రెస్ టీ కాంగ్రెస్ యం.యల్యేలు వాదిస్తే, ఆమె కారణంగానే అనేక వందల మంది యువకులు బలిదానాలు చేసారని తెరాస నేతల వాదన. బీజేపీ కూడా తెరాస వాదనలతో ఏకీభవిస్తూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా తనంతట తానుగా ఇవ్వలేదని, ప్రజలు ఉద్యమాలు చేసి కాంగ్రెస్ మెడలు వంచిన తరువాతనే ఇచ్చిందని, ఆ ఉద్యమాలలో అనేకమంది యువకులు బలిదానాలు కూడా చేసుకొన్నారని వాదించింది. ఈ మూడు పార్టీల వాదనలు ఎలాగున్నప్పటికీ, అనేకమంది యువకుల బలిదానాలు చేసిన విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలనే తృణ ప్రాయంగా వారు బలిదానాలు చేసినప్పుడు తెలంగాణా తెచ్చిన ఖ్యాతి కోసం ఈ మూడు పార్టీలు ఎందుకు కొట్టుకొంటున్నట్లు? తెలంగాణా కోసం బలిదానాలు చేసిన ఆ యువకుల కుటుంబాలలో కొందరికే ప్రభుత్వం సహాయం చేయదాన్ని ప్రభుత్వం ఏవిధంగా సమర్ధించుకొంటుంది?