ఈ రాజయ్య గారి గొడవేంటండీ బాబు...
posted on: Feb 18, 2015 10:23AM

అసలే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారు. రెగ్యులర్గా వుండే పేదరికం, అధిక ధరలు... ఇలాంటి సమస్యలు అలా వుంచితే, ఈ వేసవిలో నీళ్ళ పరిస్థితేంటి, కరెంటు పరిస్థితేంటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇతర రాష్ట్రాల ముందు తలెత్తుకుని ఎలా జీవించాలి... ఇలాంటి ఆలోచనలతో తెలంగాణ ప్రజలు సతమతం అయిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం కావడంతోపాటు పునర్నిర్మాణ బాధ్యతను కూడా తన భుజాన వేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాధ్యతలను నెరవేర్చడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలా వుంటే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారి పరిస్థితి మరోలా వుంది. ఆయన పైన పేర్కొన్న విషయాలన్నిటినీ ఆలోచిస్తున్నారో లేదోగానీ, వారానికోసారి మాత్రం నా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎవరైనా వేలు పెడితే ఊరుకోను అనే స్టేట్మెంట్ ఇచ్చేస్తూ జనాన్ని ఇంకా కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే ఈ స్టేట్మెంట్ ఆయన గతంలో చాలాసార్లు ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా మహాశివరాత్రి రోజున కూడా సేమ్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఫెస్టివల్ టచ్ ఇవ్వడం కోసం ‘నన్ను భోళాశంకరుడు అంటారు... నా నియోజకవర్గంలో ఎవరైనా వేలు పెడితే నేను రౌద్ర శంకరుడిని అయిపోతాను’ అన్నారు. అసలు ఆయన నియోజకవర్గంలో వేలు పెట్టిందెవరో, ఒకవేళ ఎవరైనా అలా వేలో కాలో పెడితే రాజయ్య గారు ఏం చేస్తారో అర్థంకాక జనం అల్లాడుతున్నారు.
రాజయ్య గారు డిప్యూటీ సీఎంగా ఉన్న మొన్నటి వరకూ పార్టీలో, ప్రభుత్వంలో ఆయన హవా బాగానే నడిచింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి పాయె... ఆరోగ్య శాఖ మంత్రి పదవి కూడా పాయె. త్వరలో ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోయే ప్రమాదం వుందన్న వార్తలు వచ్చాయి. స్టేషన్ ఘన్పూర్ స్థానం నుంచి రాజయ్యను రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేత పోటీ చేయించాలన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సరే, ఈ రాజకీయ వ్యూహాలు ఇలా వుంటే, రాజయ్య ఎందుకు నాల్రోజులకోసారి వేలు పెడితే ఊరుకోను అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకీ రాజయ్య హెచ్చరికలు ఎవర్ని ఉద్దేశించినవి? ఆయన నియోజకవర్గంలో వేలు పెట్టిందెవరు అనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు.. ఒకవేళ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి తనను రాజీనామా చేయమని కోరితో ఊరుకోనని కేసీఆర్కే ఇన్డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయినా రాజయ్య గారు ఇంత పౌరుషాన్ని ప్రదర్శించడం కూడా ఆయన పర్సనాలిటీకి సరిపోవడం లేదు. కారణం కూడా చెప్పకుండా మంత్రి పదవుల్లోంచి తీసేస్తే కిక్కురుమనకుండా కూర్చున్న ఆయన నోటివెంట ఇప్పుడు ‘రౌద్ర శంకరుడిని అవుతా’ లాంటి డైలాగులు రావడం నప్పట్లేదు.




.png)


.webp)


