అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు కావాలంటున్నారు..!

posted on: Jun 25, 2016 4:53PM

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కావడం లేదు. ఏ రాజకీయ నాయకుడికైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక కల. అలాంటిది అప్పట్లో తాను సీఎం పీఠాన్నే త్యాగం చేశానని ఒక సందర్భంలో అన్నారాయన. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండమని సోనియా గాంధీ, ఆజాద్ తనను అడిగారని..తనకు ముఖ్యమంత్రి పదవి వద్దు..తెలంగాణ ఇవ్వండి చాలు అన్నానని జానా వరంగల్ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే మళ్లీ పెద్దాయనకు సీఎం కుర్చీ గుర్తొచ్చింది..టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ శ్రేణులు నిరాశలో కూరుకుపోవడంతో వారిలో ఉత్సాహం నింపడానికి జానారెడ్డి నడుంబిగించారు.

 

ఈ నేపథ్యంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ మరోసారి ముఖ్యమంత్రి పీఠమే తన కల అని స్సష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..తానే సీఎం పదవిని చేపడతానని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్..తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీఎంతో పాటు సమాన హోదా కలిగిన ఏకైక నాయకుడిని తానే అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి పార్టీని వీడినవారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. 40 ఏళ్లుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు..20 ఏళ్లుగా రాజకీయంగా దగ్గరి బంధం కలిగిన వారు పార్టీని వీడటం బాధగా ఉందన్నారు. అయినప్పటికి పార్టీకి అవమానం కలిగించేలా ఫిరాయింపులుకు పాల్పడిన వారి నుంచి పార్టీని కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త ఎంతో కసితో ఉన్నారని అన్నారు. మొత్తానికి జానా మరోమారు తన మనసులో మాట బయటపెట్టుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...