ఆ మూడ్‌ నుంచి బయటికి రాలేకపోతున్న కిషన్‌రెడ్డి..!

 

కిషన్‌రెడ్డి... ప్రస్తుత హోదా బీజేఎల్పీ నేత... అయితే ఏడాది క్రితం వరకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన...  ఇంకా ఆ మూడ్‌లో నుంచి బయటికి రావడం లేదంట... కొత్త అధ్యక్షుడు వచ్చి ఏడాది దాటిపోతున్నా... ఇంకా పార్టీలో అన్నీ తానే... అంతా తానే అనే ఫీలింగ్ లో ఉంటున్నారట. సుదీర్ఘకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పనిచేసి ఉండటంతో... ఆ మూడ్‌ నుంచి బయటికి రాలేకపోతున్నారట. అందుకే కొత్త అధ్యక్షుడి కింద పనిచేయలేక పార్టీ సమావేశాలను సైతం కూడా లైట్ తీసుకుంటున్నారట. అంతేకాదు.. ఆయన మీటింగ్ పెట్టిన రోజు... మరెవరూ మీటింగ్‌లు పెట్టకూడదంటూ అనధికారికంగా ఆర్డర్స్‌ జారీ చేస్తున్నాడట. దాంతో కిషన్‌రెడ్డి వ్యవహారశైలి పార్టీ నేతలకు, శ్రేణులకు తలనొప్పిగా మారిందంటున్నారు. అంతేకాదు చింత చచ్చినా... పులుపు చావలేదంటే ఇదేనేమో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ బీజేపీకి ఇప్పటికీ తానే అధ్యక్షుడిననే ఫీలింగ్ లో కంటిన్యూ అవుతూ... నేను చెప్పిందే శాసనం... నేను పెట్టిందే మీటింగ్ అంటున్నారని... అంతేకాదు చిన్న చిన్న విషయాలకీ అలగడం కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందంటున్నారు.

 

అధ్యక్ష పదవిలో ఉన్నన్నాళ్లూ హల్‌చల్‌ చేసిన కిషన్‌రెడ్డి... పదవీకాలం ముగియగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం తగ్గించేశారని... చివరికి ఇటీవల జరిగిన అమిత్‌షా టూర్‌‌లో అంటీముట్టనట్టు వ్యవహరించారని అంటున్నారు. కిషన్‌రెడ్డి వ్యవహారశైలిపై పలువురు అమిత్‌షాకి కంప్లైంట్‌ చేయడంతో... కిషన్‌కి క్లాస్‌ కూడా పీకారట. అయినా కిషన్‌రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటిలాగానే పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారని చెప్పుకుంటున్నారు. మొన్నటిమొన్న తెలంగాణ అంతటా నిర్వహించిన బీజేపీ విస్తారక్‌ కార్యక్రమానికి కూడా కిషన్‌రెడ్డి దూరంగా ఉన్నారని, అమిత్‌ షా ఆదేశించిన ప్రోగ్రామ్‌ను కూడా పట్టించుకోలేదంటే... అసలు అంత ధైర్యం కిషన్‌రెడ్డికి ఎలా వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు.

 

ఇక పార్టీ రివ్యూ మీటింగ్స్‌కి కూడా కిషన్‌రెడ్డి హాజరుకావడం లేదట. అంతేకాదు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హాజరైన సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారట. మరోవైపు మీడియాకి ముందుగా సమాచారమిచ్చిన ప్రెస్‌మీట్‌‌లను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఇలా రద్దు చేసుకోవడానికి... మరొకరు అదేరోజు మీడియా సమావేశం పెట్టడమే కారణమంటున్నారు. కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టిన రోజే... బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు కూడా మీడియా సమావేశం పెట్టడంతో... ఎందుకు పెట్టారంటూ కిషన్‌ రుసరుసలాడారంట. ఒకేరోజు రెండు ప్రెస్‌మీట్‌లు పెడితే పార్టీ ఇమేజ్‌ ఏం కావాలంటూ రఘునందన్‌పై కిషన్‌‌రెడ్డి ఫైరయ్యారట. దాంతో కిషన్‌రెడ్డి వ్యవహార శైలిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీలో ఏం జరిగినా తనకు చెప్పే జరగాలన్నట్లుగా కిషన్‌రెడ్డి వ్యవరిస్తున్నారని, ఇప్పటికీ తానే అధ్యక్షుడినన్నట్లుగా దర్పం ప్రదర్శిస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu