తెలంగాణ కత్తికి ఎటైనా పదునే!
posted on: Jul 9, 2014 5:27PM
.jpg)
తెలంగాణ రాజకీయ నాయకుల కత్తికి రెండు వైపులా పదును వుంటుంది. వాళ్ళ నాలుకలకు ఏ తరహాలో అయినా మాట్లాడే శక్తి వుంటుంది. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాకపోయినా పర్లేదని, ఒకవేళ బిల్లు అసెంబ్లీకి వచ్చినా కేవలం అభిప్రాయం తెలుసుకోవడానికే తప్ప అసెంబ్లీ చెప్పినట్టు చేయడానికి కాదని, ఒకవేళ అసెంబ్లీ బిల్లును తిప్పి పంపినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి వుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు వాదించారు. మొత్తానికి తెలంగాణ బిల్లును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసింది. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు వర్తమానంలో సేమ్ ఇలాంటి అంశం మీదే తెలంగాణ నాయకులు మరోలా మాట్లాడుతూ, వినేవాళ్ళ కళ్లు తెరిపిస్తున్నారు. పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ నాయకులు తాము గతంలో చేసిన వాదనకు పూర్తి రివర్స్గా వుండే వాదనలు చేస్తున్నారు. వారి తాజా వాదన ఏంటంటే, ఏ రాష్ట్రానికైనా సరిహద్దులు మార్చే బిల్లును పార్లమెంటు ఆమోదించాలంటే మొదట ఆ బిల్లును సదరు రాష్ట్ర శాసనసభకు పంపాలట. ఆ రాష్ట్ర శాసనసభ ఒప్పుకుంటేనే సరిహద్దులు మార్చాలట, శాసనసభ ఒప్పుకోకపోతే సరిహద్దులు మార్చడానికి వీల్లేదట. ఇప్పుడు చెప్పండి.. తెలంగాణ రాజకీయ నాయకుల నాలుకలకు రెండువైపులా పదునే కదూ!




.jpg)

.webp)



