ఏ చట్ట ప్రకారం 19న సర్వేకి సహకరించాలి?

posted on: Aug 13, 2014 12:15PM

 

ఈనెల 19వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సర్వే తెలంగాణలో వున్న సీమాంధ్రులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశంతో చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తు్న్న నేపథ్యంలో ఈ సర్వేని తెలంగాణ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. సర్వే పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పౌర హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేకి సహకరించాల్సిన అవసరం లేదని ప్రజలకు స్పష్టంగా చెబుతున్నారు. ఏ చట్ట ప్రకారం ఈ సర్వేకి సహకరించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే విషయంలో ప్రజలు ఎంతమాత్రం భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదని, సర్వేకి సహకరించకపోతే ఏవైనా సమస్యలు ఎదురవుతాయేమోనని భయపడాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, ఈ సర్వేకి సహకరిస్తేనే ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు తమకు సంబంధించిన, తమకు వెల్లడించడానికి ఇష్టం లేని ఏ అంశాన్నీ సర్వే సిబ్బందికి వెల్లడించాల్సిన అవసరం లేదని, మనకు సంబంధించిన ఆస్తులు తదితర వివరాలన్నీ కేవలం ఒక్క భారత ప్రభుత్వానికి మాత్రమే వెల్లడి చేయాలని, ఆధార్ కార్డుల రూపకల్పన సమయంలో మనకు సంబంధించిన వివరాలన్నీ భారత ప్రభుత్వానికి వెల్లడించామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలేవీ వెల్లడించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. మన ఆస్తులు, స్థానికత తదితర అంశాల గురించి మనను ప్రశ్నించే హక్కు కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆయన చెబుతున్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకి ఎలాంటి చట్టబద్ధత, హేతుబద్ధత లేదని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చెబుతున్నారు. నిజానికి కేంద్ర పరిధిలో వున్న అంశాల గురించి సర్వేలు జరపడం గానీ, సమాచార సేకరణ గానీ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు వుండదని, ఒకవేళ తమకు ఆ హక్కు వుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తు్న్న పక్షంలో తాము ఆ సర్వే ఎందుకు చేయబోతోంది, సర్వే ఉద్దేశమేమిటి? సర్వే సందర్భంగా ప్రజల్ని ఏయే ప్రశ్నలు అడగబోతున్నారు, ఆ ప్రశ్నల ద్వారా ప్రజల నుంచి ఎలాంటి సమాధానాన్ని ఆశిస్తున్నారు? ఆ ప్రశ్నలు అడగటంలో తమకున్న చట్టపరమైన హక్కులేమిటి అనే అంశాలన్నిటితో ఒక గెజిట్ విడుదల చేయాలి. ఆ గెజిట్ మీద అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాతే తమకు ఉన్న హక్కులకు లోబడి సర్వే చేయాలి. మరి తెలంగాణ ప్రభుత్వం అలాంటి కసరత్తులేవీ చేయకుండా సర్వే చేయడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధమేనని జంధ్యాల రవిశంకర్ చెబుతున్నారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...