ఫోన్ ట్యాపింగ్ కేసు.. డీఎస్పీ ప్రణీత్ రావుకు డిమోషన్
posted on: Feb 4, 2026 8:21AM

తెలంగాణ రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీష్ రావులను విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేసింది. ఆయనను డీఎస్పీ క్యాడర్ నుంచి సీఐగా స్థాయికి డిమోట్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పటి ఎస్వోటీ ప్రణీత్ రావుకు రేవంత్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ డీఎస్పీ నుంచి సీఐ స్థాయికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్కువ కాలంలోనే రూల్స్కు విరుద్ధంగా డీఎస్పీగా పదోన్నతి పొందటం, ప్రొబేషన్ కాలంలోనే విధుల దుర్వినియోగానికి పాల్పడిన కారణాలపై సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణీత్రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి క్యాన్సిల్ అయింది. ఇక ఆయన ఇన్స్పెక్టర్ హోదాతోనే కొనసాగుతారు. సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కల్పించే విధానం అమల్లో ఉంది.
అయితే ప్రణీత్ రావు అటువంటి కార్యకలాపాల్లో పనిచేయకపోయినా డీఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లోనే కలకలం రేపిన సంగతి విదితమే.ఇక ఆయన సర్వీస్ డీటెయిల్స్ విషయానికి వస్తే.. ఎస్సై హోదాలో 2016 అక్టోబరు 24న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్( కు బదిలీ అయిన ప్రణీత్ రావు 2023 డిసెంబరు 13 వరకు అక్కడే పనిచేశారు. ఎస్ఐబీలో ఉన్నప్పుడే ఇన్స్పెక్టర్గా, యాక్సిలరేటెడ్ విధానంలో డీఎస్పీగా కూడా ప్రమోషన్ పొందారు. ఎస్ఐబీలో ఆయన నేతృత్వంలోనే స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఎస్ఓటి ఏర్పాటైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే ఎస్ఐబీ భవనంలోని సీసీ కెమెరాలు స్విచ్ఆఫ్ చేసి, ల్యాప్టాప్లు, కంప్యూటర్లలోని హార్డ్డిస్క్లు, అందులోని డేటాను ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.



.webp)


