తెలంగాణ కాంగ్రెస్ చేయిజారిపోతోందా!

posted on: Jun 13, 2016 1:06PM

 

2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ ఏ వ్యూహంతో తెలంగాణను తీసుకువచ్చినా కానీ... అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ ఆ పార్టీకి అడుగడుగునా గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. వారానికో వివాదం, రోజుకో పుకారుతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తెరాసలో చేరుతున్నారన్న వార్తలు ఊపందుకుంటున్నాయి. కేసీఆర్‌తో వీరి మంతనాలు ముగిసాయనీ, ఇక లాంఛనంగా ‘చేయి’ జారిపోవడమే మిగిలిందనీ తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో డి.శ్రీనివాస్, కేశవరావు వంటి సీనియర్ నాయకులను చేజార్చుకున్న కాంగ్రెస్‌కు గుత్తా ఎడబాటు మాయని గాయంగా మిగిలిపోనుంది.

 

ఇక వీరితో పాటుగా జి.వెంకటస్వామి కుమారులైన వినోద్‌, వివేక్‌లు కూడా గులాబీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణలో తమ పరిస్థితి మెరుగ్గానే ఉందని మురిసిపోయిన కాంగ్రెస్ నేతలకు తాజా వలసలు శరాఘాతంగా తోస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని తెదెపా వలసల వ్యూహంలో చిక్కుకుని చిక్కిపోయింది. 15 మంది ఎమ్మెల్యేల ఖాతా కాస్తా 3 దగ్గరకి వచ్చి ఆగింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి కూడా వలసలు మొదలైతే ఏమిటి పరిస్థితి అన్నది కాంగ్రెస్ నేతల ఆందోళన. 2014 ఎన్నికల అనంతరం 21 సీట్లతో కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సాధించింది. ప్రస్తుతానికి ఆ సంఖ్య కాస్తా 13కి దిగబడిపోయింది. మరి ఈ అంకెలు ఏ తీరానికి చేరుకుంటాయో, ప్రతిపక్ష హోదా సైతం ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం ఇప్పటి కాంగ్రెస్‌ది. అంతర్గత కుమ్ములాటలు, అధికార పట్ల ఆకర్షణ... ఆ పార్టీని బలహీనపరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకేనేమో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ కంటే కోదండరామ్‌ గొంతే బలంగా వినిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...