హైదరాబాద్ మెట్రో నిధుల విడుదలలో జాప్యం వద్దు.. కిషన్ రెడడ్డికి రేవంత్‌ బహిరంగ లేఖ

posted on: Jun 17, 2026 12:02PM

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ 2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులు,  ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదలలో  మరింత జాప్యం చేయవద్దని  కోరుతూ  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి  కిషన్‌రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ అంశంపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు.   

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌1 మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్‌ 2 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. మొత్తం ఏడు కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు  38 వేల 595 కోట్ల అంచనా వ్యయంతో  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 
ఫేజ్‌ 1 ప్రైవేటు నిర్వహణలో ఉండటం, ఫేజ్‌ 2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయటంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించిందనీ,  మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్ వర్క్​లో నడిచేందుకు వీలుగా ఫేజ్‌ 1ను స్వాధీనం చేసుకునే అసాధారణ నిర్ణయం తీసుకుందానీ ఆ లేఖలో వివరించారు. 

ఫేజ్‌ 1 స్వాధీనం ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు  13 వేల 538.53 కోట్లు కలిపి మొత్తం 15 వేల కోట్ల లావాదేవీలున్నాయి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్‌సీఎల్‌ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్‌ చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు.  

ఐఆర్‌ఎఫ్‌సీ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి, డ్యూ డిలిజెన్స్‌ పూర్తి చేసి రుణ మంజూరు ఒప్పందం చేసిందనీ,   రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిందనీ వివరించిన రేవంత్ రెడ్డి.. ఐఆర్‌ఎఫ్‌సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం  84.32 కోట్ల అప్‌ఫ్రంట్‌ ఫీజు చెల్లించిందన్నారు. . ఈక్విటీ  1,461.47 కోట్లు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసిందని తెలిపారు.  

ఈ ఒప్పందాలన్నీ పూర్తయ్యాక, అన్ని షరతులు నెరవేర్చాక, 2026 జూన్‌ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి,  తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగటం లేదనీ,  కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం ప్రకారం ఐఆర్​ఎఫ్​సీ రుణాన్ని  విడుదల చేయించాలని కోరుతున్నామని రేవంత్  ఆ  లేఖలో పేర్కొన్నారు. 

తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని కోరారు. మెట్రో ఫేజ్‌ 2ను కేంద్రం, రాష్ట్రం 50:50 జాయింట్‌ వెంచర్‌గా ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని సీఎం ఈ లేఖలో వివరించారు. 

ఒకవేళ అనుమతులు ఆలస్యమైతే..  రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా ఫేజ్‌2ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ముందస్తు అనుమతులను ఆలస్యం లేకుండా కేంద్రం నుంచి ఇప్పించాలని రేవంత్ ఆ లేఖలో కోరారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...