కేసీఆర్ వైఎస్ ను ఫాలో అవుతున్నారా?
posted on: Nov 10, 2014 1:14PM

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ను బలంగా ప్రయోగించారు. ఇతర పార్టీల్లోని నేతలను కాంగ్రెస్ లోకి లాగడానికి అన్నిరకాలుగా ట్రై చేశారు. నయానో.. భయానో ఎలాగైనా కాంగ్రెస్ లోకి చేర్చుకొని ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా టీడీపీ నేతలనైతే వైఎస్ ఘోరంగా టార్గెట్ చేశారు. వైఎస్ మాట వినని టీడీపీ నేతలు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇలాంటి పనులు మంచివి కావని కాంగ్రెస్ నేతలే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మొండిగా ముందుకెళ్లారు. ఏకంగా టీడీపీని చీల్చేందుకు కుట్ర చేశారు. కానీ చంద్రబాబు సమర్థత ముందు ఆ కుట్రలు పారలేదనుకోండి... అది వేరే విషయం కానీ ఇప్పుడు తెలంగాణ లో సీఎం కేసీఆర్ కూడా అదే ఆకర్ష్ సిద్ధాంతాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి సరిపడా మెజార్టీ ఉంది. చంద్రబాబులో పెద్ద మెజార్టీ కాకపోయినా సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. అయినా సీఎం కేసీఆర్ మాత్రం కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. నయానో భయానో టీఆర్ఎస్ లోకి లాగేందుకు ట్రై చేస్తున్నారు. కారు ఎక్కకపోతే నియోజకవర్గానికి నిధులిచ్చేది లేదని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను భయపెడుతున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో చాలామంది తమకు ఇష్టం లేకపోయినా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇప్పటికి ఇలా చాలామంది ఎమ్మెల్యేలు గులాబీదళంలోకి వచ్చారు. అయినా సీఎం కేసీఆర్ వెనక్కు తగ్గడం లేదు. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారట. ఎలాగైనా టీఆర్ఎస్ లోకి వచ్చేయాలని గట్టిగా చెబుతున్నారట. అధికారపార్టీ నుంచి ఈరేంజ్ లో బెదిరింపులు రావడం గతంలో ఎప్పుడూ వినలేదని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
తలసాని, తీగల వంటి నేతలు టీడీపీకి రాజీనామా చేశారు. కానీ వారు మాత్రం తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఒకపార్టీకి రాజీనామా చేసి అదే పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగడం దేనికి సంకేతం? మాటల తూటాలతో విరుచుకుపడే కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారు? తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, క్రిష్ణయ్య లాంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంది. అందుకే టీడీపీ మరింత ఎదగకుండా కావాలనే సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వల వేయడం మాని పాలనపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నాయి.




.jpg)

.webp)



