2019 టార్గెట్గా కేసీఆర్ కొత్త గేమ్... కాంగ్రెస్, బీజేపీల్లో కలవరం
posted on: Apr 11, 2017 12:08PM

ఆపరేషన్ ఆకర్ష్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయ్, అంతలా ఉంది దాని ఎఫెక్ట్. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి పార్టీల మనుగడే ప్రశ్నార్ధకంగా మారగా... కొన్ని పార్టీలైతే మొత్తం తుడిచిపెట్టుకునిపోయే పరిస్థితి. ఇటు తెలంగాణలో కేసీఆర్... అటు ఏపీలో చంద్రబాబునాయుడు... ఇద్దరూ ఆపరేషన్ ఆకర్ష్లతో ప్రత్యర్ధి పార్టీలను దెబ్బకొట్టినవాళ్లే. అయితే ఏపీలో చంద్రబాబు దెబ్బకు వైసీపీ తట్టుకుని నిలబడినా, తెలంగాణలో మాత్రం కేసీఆర్ స్ట్రాటజీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తోపాటు టీడీపీ కుదేలైపోయాయి. తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. నలుగైదుగురు ఒకరిద్దరు మినహా ముఖ్యనేతలంతా టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్దీ అదే పరిస్థితి. అయితే మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దాంతో ప్రతిపక్షాల్లో కలవరం మొదలైంది.
కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి కాంగ్రెస్ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి 12మంది, సీపీఐ నుంచి ఒక్కరు, వైసీపీ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే గులాబీ కండువా కప్పేసుకోగా, ఇప్పుడు తాజాగా మరికొందరు కారెక్కడానికి రెడీగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ రోజు వీళ్లంతా టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సీనియర్లతో టచ్లో ఉన్నారనే చెబుతున్నారు. ఇటీవల డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డితో పాటు ఎంపీ నంది ఎల్లయ్యలు... ప్రగతిభవన్లో కేసీఆర్ను కలవడం అనుమానాలకు తావిచ్చింది. పేరుకు పాలమూరు ప్రాజెక్టులపై కలిసినా, ఇంటర్నల్గా టీఆర్ఎస్లో చేరడంపైనే చర్చలు జరిగాయనే టాక్ బయటికొచ్చింది. దాంతో మలిదశ ఆపరేషన్ ఆకర్ష్కు బూస్ట్ ఇచ్చినట్లైంది.
కేసీఆర్ను కలిసిన పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అందరూ కారెక్కకపోయినా, ఇద్దరు మాత్రం కచ్చితంగా ప్లీనరీ రోజు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటివరకూ బీజేపీని టచ్ చేయని కేసీఆర్... ఈసారి కమలం పార్టీని కూడా టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్న బీజేపీని దెబ్బకొట్టేందుకు, కమలం పార్టీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వలలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు పడ్డారని, వాళ్ల కూడా త్వరలోనే కారెక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
2019 ఎన్నికలే టార్గెట్గా కేసీఆర్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారన్న సమాచారంలో ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లో అలజడి మొదలైంది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. మరి కేసీఆర్ కొత్త గేమ్లో ఈసారి ఎన్ని వికెట్లు పడతాయో చూడాలి.







.webp)


