దళితుల మెప్పు కోసం కేసీఆర్ మరో స్కెచ్

posted on: Apr 9, 2016 11:26AM

రాజ‌కీయ వ్యూహాల్లో తిరుగులేని నాయ‌కుడు కేసీఆర్. ఆయ‌న ఓ పొలిటిక‌ల్ స్టెప్పు వేశారంటే.. క‌నీసం ప‌దేళ్ల ముందు చూపు ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్. ఇపుడు అలాంటి వ్యూహమే మ‌రొకటి ర‌చించార‌ు కేసీఆర్. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఎన్నికలవ్వగానే తూచ్ అన్నారు. ముఖ్యమంత్రి పీఠంలో తానే కూర్చున్నారు. తన మంత్రివర్గంలోకి దళితుడైన రాజయ్యను తీసుకున్నట్లే తీసుకుని అవినీతి ఆరోపణల సాకుతో కేబినెట్‌ నుంచి తొలగించారు. దీంతో దళిత సంఘాలు మండిపడ్డాయి. దళిత వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీనిపై ఆలోచనలో పడ్డ కేసీఆర్‌కు వెంకటస్వామి రూపంలో పెద్ద ఆఫర్ వచ్చింది. అనారోగ్యంతో కాకా మరణించడంతో వెంకటస్వామి జ్ఞాపకార్థం తొలిసారిగా తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ మీద ఏర్పాటు చేసి వారి ఆగ్రహన్ని చల్లార్చారు కేసీఆర్. 

ఇప్పుడు మరోసారి దళితుల విశ్వాసం దెబ్బతినకుండా చూడటానికి గులాబీ దళపతి మరో స్కెచ్ గీశారు. రాజ్యాంగ నిర్మాత, దళిత జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగరంలో ప్రతిష్టించాలని కేసీఆర్ సంకల్పించారు.  125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం నిర్మించడంతో పాటు, అంబేద్కర్ పేరిట ప్రతీ నెల… ప్రతీ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దళితులకు మూడెకరాల భూపంపిణీతో పాటు… దళితుల అభ్యున్నతి, చైతన్యం కోసం కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నారు. ఈ నెల 14న విగ్రహానికి శంకుస్థాపన చేసి వచ్చే ఏప్రిల్ 14న విగ్రహావిష్కరణ చేయాలి, దానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అసలే ఇప్పుడు కేసీఆర్ పట్టిందల్లా బంగారమే కాబట్టి ఈ కొత్త స్కెచ్ కూడా తప్పకుండా ఫలితాన్నిస్తుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...