లక్ష నాగళ్లతో దున్నిస్తానని నేనెప్పుడన్నాను?
posted on: Jan 12, 2015 10:38AM
.jpg)
ఇదివరకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీని ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారనే వంకతో లోపల కొన్ని ప్రదేశాలలో రోడ్లను, చెట్లను ప్రొక్లేయిన్లు అవీ పెట్టి కూల్చి వేయించారు. కానీ అందుకు అసలు కారణాలు మాత్రం వేరే ఉన్నాయని అందరికీ తెలిసిందే.
ఆ తరువాత తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నించి చదును చేస్తానన్నట్లు వార్తలు వచ్చేయి. కానీ కొన్ని రోజుల క్రితం ఆయన స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి రామోజీ రావును కలిసి రావడమే కాకుండా ఆయన నిర్మించబోయే ‘ఓం సిటీ’ ని తెగ మెచ్చుకొన్నారు.
ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ నిన్న ఒక విలేఖరి కేసీఆర్ ను ప్రశ్నించినప్పుడు “నేను ఆ మాట ఎప్పుడన్నాను? నేను అన్నప్పుడు నువ్వు విన్నావా? మీకు తోచినది వ్రాసేసుకొని మళ్ళీ నన్ను ప్రశ్నించడం ఏమిటి? అర్ధం లేని మాటలు మాట్లాడకు. అసలు నువ్వు ఏ పత్రిక నుండి వచ్చేవు? అంటూ ఆ విలేఖరిపై ఆయన కోపంగా విరుచుకుపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో ఒక్క కుంట ప్రభుత్వ భూమి కూడా లేదని స్పష్టం చేసారు. అంతే కాదు రామోజీ ఫిలిం సిటీ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. తాము పెట్టుబడుల కోసం విదేశాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు, రామోజీ రావు వందల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రంలో ‘ఓం సిటీ’ నిర్మిస్తానంటే తామెందుకు అభ్యంతరం పెడతామని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారు ఆంధ్రావాళ్ళా లేదా తమిళ్ వాళ్ళా లేదా మహారాష్ట్రా వాళ్ళా అనే విషయం తాము పట్టించుకోబోమని అందరికీ తమ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలుకుతుందని అన్నారు.
అందువలన మిగిలిన మీడియా, వ్యక్తులు, సంస్థల పట్ల కేసీఆర్ వైఖరి ఏవిధంగా ఉన్నప్పటికీ రామోజీకి, ఆయన సంస్థల పట్ల చాలా సానుకూలంగానే ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఆంధ్రా వాళ్ళను, మీడియాను అమితంగా ద్వేషించే ఆయన ఒక్క రామోజీపట్ల హటాత్తుగా తన వైఖరి ఎందుకు మార్చుకొన్నారు? అనే ప్రశ్నకు వారే జవాబు చెప్పాల్సి ఉంటుంది.



.jpg)
.jpg)

.webp)



