బకాయి మిల్లర్ల పై ఉక్కుపాదం.. రంగంలోకి 28 మంది కమాండోలు..!

posted on: Aug 21, 2026 6:19PM

 

రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా బకాయి పడిన మిల్లర్లపై కఠిన చర్యలకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది అత్యుత్తమ కమాండోలను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగంలోకి నియమించింది. వీరితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా మిల్లులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ శుక్రవారం సివిల్ సప్లైస్ భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కొత్తగా విధుల్లో చేరిన కమాండోలకు స్వాగతం పలికిన ఆయన.. వారికి అప్పగించిన బాధ్యతలు, శాఖ విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. 

పౌర సరఫరాల శాఖకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై కమాండోలకు ఇప్పటికే మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలపై తెలంగాణ పోలీస్ అకాడమీలోనూ వారికి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. గత సీజన్‌ KMS 2025-26లో 154 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించినట్లు కమిషనర్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు స్థాయి సేకరణ అని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ప్రభుత్వం రైతుల నుంచి భారీ మొత్తంలో ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అప్పగించిన నేపథ్యంలో, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి బియ్యం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో బకాయిలు ఉన్న మిల్లర్లపై ఇక క్షేత్రస్థాయిలో నిఘా, తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నారు.ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి తనిఖీల్లో ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోల సామర్థ్యాన్ని ఇకపై పౌర సరఫరాల శాఖ వినియోగించుకోనుంది.

 ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం పరిధిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలుగా వీరు పనిచేయనున్నారు. బకాయి ఉన్న మిల్లర్ల వద్దకు వెళ్లి నిల్వలు, రికార్డులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం తదితర అంశాలపై తనిఖీలు చేపట్టనున్నారు. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించడం, పౌర సరఫరాల శాఖ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన మిల్లర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతుల నుంచి ప్రభుత్వం భారీగా సేకరించిన ధాన్యం ప్రజలకు చేరాల్సిన బియ్యంగా మారే ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడటమే లక్ష్యంగా ఈ ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయి. కమాండోల రంగప్రవేశంతో బకాయి మిల్లర్లలో ఆందోళన మొదలైనట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Telangana Civil Supplies Department, arrears millers, Stephen Ravindra, Greyhounds, octopus, Minister uttam kumar reddy

google-ad-img
    Related Sigment News
    • Loading...