Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...23న తెలంగాణ మంత్రివర్గ సమావేశం...కీలక అంశాలపై చర్చ
posted on: Apr 21, 2026 10:27AM
.webp)
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. సచివాలయంలోని క్యాబినెట్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం అమలుపై చర్చ జరగనుంది. బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించిన ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నందున, దీని విధివిధానాలపై మంత్రివర్గం క్షేత్రస్థాయిలో చర్చించనుంది.
రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన స్థానిక సంస్థల (మండల, జిల్లా పరిషత్) ఎన్నికలపై కూడా ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడవచ్చు. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణ వ్యూహాలపై మంత్రుల బృందం సమాలోచనలు చేయనుంది. వీటితో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం వంటి పెండింగ్ అంశాలను కూడా ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె హెచ్చరికలు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలు, డియర్నెస్ అలవెన్స్ (DA) వంటి డిమాండ్లపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, పదవీ విరమణ చేసిన వారి ప్రయోజనాలు, ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల వినియోగం వంటి అంశాలపై చర్చించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
రైతాంగ సమస్యల పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం వంటి అంశాలపై సమావేశంలో కీలక మార్గదర్శకాలు జారీ కానున్నాయి. క్షేత్రస్థాయిలో సేకరించిన కుల గణన నివేదికపై ప్రజల నుంచి వస్తున్న స్పందనను, భవిష్యత్ కార్యాచరణను కూడా క్యాబినెట్ సమీక్షించనుంది.
రాష్ట్రంలోని మెట్రో రైలు తొలి దశ స్వాధీనం, ఎల్ అండ్ టీ సంస్థతో ఆర్థిక లావాదేవీల పరిష్కారం వంటి పరిపాలనా పరమైన అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వీటన్నింటిపై స్పష్టమైన ఆదేశాలు వెలువడనుండటంతో, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎటువంటి కీలక మార్పులు చోటుచేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



.webp)


