Latest News

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్

posted on: Mar 23, 2026 9:40PM

 

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రత, న్యాయ రక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక బిల్లులకు ఆమోదం తెలిపారు.

1. హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్ బిల్లు 2026

విద్వేషపూరిత ప్రసంగాలు, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను అరికట్టేందుకు “తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు-2026”కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోషల్ మీడియా పోస్టులు, అల్లర్లు ప్రేరేపించే ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపొందించారు.

2. గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు

“తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్-2026”కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 4.2 లక్షల గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, సామాజిక భద్రత కల్పించనున్నారు. వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో బిల్లును ఆమోదించారు.

3. హైదరాబాద్ మెట్రో స్వాధీనం

హైదరాబాద్‌లోని 69 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. సుమారు రూ.15 వేల కోట్లతో ఫేజ్-1 ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. లావాదేవీల నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)కు అప్పగిస్తూ, దానిని నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

4. అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు

న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు”కు ఆమోదం లభించింది. వామనరావు దంపతుల హత్య ఘటనల నేపథ్యంలో న్యాయవాదులకు భద్రత కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

5. కులగణన నివేదికకు ఆమోదం

జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సమర్పించిన కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక సిద్ధమైంది. నివేదికను మరింత పరిశీలించేందుకు కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించారు.

6. రోహిత్ వేముల చట్టం

విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు.

7. తల్లిదండ్రుల మద్దతు బిల్లు

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ.10 వేల వరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించే బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...