తెలంగాణ బీజేపీలో ఆపరేషన్ సయోధ్య.. సక్సెస్ అవుతుందా..?

posted on: Jul 19, 2026 12:14PM

 

తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను తొలగించి, నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హైదరాబాద్‌ వేదికగా "ఆపరేషన్ సయోధ్య"ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అభయ్ పాటిల్ తెలంగాణ కమలం పార్టీ అగ్ర నేతలతో వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నారు.

హైకమాండ్ నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు తెలంగాణకు వచ్చిన  పాటిల్, పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన ప్రత్యేకంగా బ్రేక్‌‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. 

ఈ ఉదయపు అల్పాహార సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నేతల మధ్య సమన్వయం మరియు రాబోయే పొలిటికల్ యాక్షన్ ప్లాన్ గురించి వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. హైకమాండ్ పంపిన ప్రధాన సందేశాన్ని రాష్ట్ర నాయకత్వానికి అభయ్ పాటిల్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది.

కేవలం ఈ ఒక్క సమావేశంతోనే కాకుండా, గత 24 నుండి 48 గంటలుగా అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీకి చెందిన కీలకమైన ముగ్గురు అగ్ర నేతలతో విడివిడిగా సమావేశమై సుదీర్ఘ మంతనాలు జరిపారు. నిన్ననే ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ ఈటల రాజేందర్‌లతో కీలక భేటీలు పూర్తి చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయడం వంటి అంశాలపై వీరి మధ్య లోతైన చర్చ జరిగింది. ఈ ఇద్దరు కీలక నేతలతో భేటీ అనంతరం, అభయ్ పాటిల్ వెంటనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కూడా సమావేశమయ్యారు.

ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో జరిగిన భేటీలో అభయ్ పాటిల్ కొన్ని కీలక సూచనలు చేశారు. పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే అధికారిక సమావేశాలు, ప్రజా పోరాట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి, ప్రజాక్షేత్రంలో బీజేపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే పరమావధిగా పనిచేయాలని హైకమాండ్ ఆదేశాలను నొక్కి చెప్పారు. ఈ వరుస భేటీలు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

త్వరలోనే తెలంగాణలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల యాక్షన్ ప్లాన్‌పై కూడా ఈ సమావేశంలో లోతుగా విశ్లేషించారు. ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ బూత్ స్థాయి నుంచి ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే వ్యూహాలను ఇరు నేతలు పంచుకున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లే అంశాలు ఈ చర్చల్లో ప్రధాన పాత్ర పోషించాయి.

ఈ భేటీ అనంతరం కాషాయ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేంద్ర పెద్దల మార్గదర్శకత్వంలో తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని, తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ అంతర్గత చర్చల ఫలితంగా త్వరలోనే పార్టీ పరంగా మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం కేవలం సాధారణ మర్యాదపూర్వక భేటీగానే బయటకు కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం గట్టి పొలిటికల్ స్కెచ్‌లు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ త్వరలోనే విసృత స్థాయి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది.

Telangana BJP, Abhay Patil, Bandi Sanjay, MP Eatala Rajender, Dharmapuri Arvind, BJP Political News, Ramchandra Rao, GHMC elections

google-ad-img
    Related Sigment News
    • Loading...