తన మాటలతో తెలంగాణ అసెంబ్లీలో కలకలం రేపిన హరీష్రావ్
posted on: Mar 22, 2017 11:15AM
.jpg)
తెలంగాణ అసెంబ్లీలో హరీష్రావ్ మంటలు పుట్టించారు. తన వాడివేడి మాటలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మంచి పని చేసినా, కేవలం తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా సభలో మాట్లాడిన హరీష్.... కేసుల పేరుతో కాంగ్రెస్ నేతలు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. చనిపోయిన వ్యక్తుల పేర్లతో, ఫోర్జరీ సంతకాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీష్రావ్.... పిల్లులు కూడా లేనిచోట పులులు ఉన్నాయంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై సుదీర్ఘంగా మాట్లాడిన ఇరిగేషన్ మినిస్టర్.... పాలమూరును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు.
రెండున్నరేళ్లలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామన్న హరీష్రావ్.... అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో చేసినదానికంటే ఈ రెండున్నరేళ్లలో ఎక్కువ ఖర్చు చేశామని లెక్కలు సభ ముందు పెట్టారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా అంటూ ప్రశ్నించిన హరీష్.... తెలంగాణ నీటిని ఆంధ్రాకి తరలించింది కాంగ్రెస్ నేతలు కాదా అన్నారు. కల్వకుర్తికి గుండెకాయలాంటి రెండో లిఫ్ట్ కుంగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాక మహబూబ్నగర్ జిల్లాకి నీళ్లిస్తుంటే, కాంగ్రెస్ నేతల కాళ్ల కిందకి నీళ్లొచ్చినట్లు భయపడుతున్నారని సెటైర్లేశారు. రీడిజైనింగ్పై రాద్థాంతం చేస్తున్న కాంగ్రెస్ నేతలు... రీ ఇంజినీరింగ్తో జరిగే నష్టమేంటో చెప్పాలన్నారు.
హరీష్రావ్ వ్యాఖల్యపై జానారెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. గత ప్రభుత్వాల నిర్ణయాలపై ఆధారపడే టీఆర్ఎస్ ప్రస్తుతం నడుస్తోందని చురకలంటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు.... కాంగ్రెస్ హయాంలోనే లక్షల ఎకరాల భూమిని సేకరించామన్నారు. తాము భూములు సేకరించకపోతే...ఈ ప్రాజెక్టులకు అడుగులు ముందుకు పడేవా అంటూ జానారెడ్డి ప్రశ్నించారు.



.jpg)



.webp)


