Latest News
ఇప్పసారా, ఇందిరా...సభలో ఒక రసారా భాస!
posted on: Mar 25, 2026 9:44PM
.webp)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. నిన్నటి వరకూ గాంధీ వర్సెస్ గాడ్సేగా ఉన్న గొడవ కాస్తా.. ఒక్కసారిగా ఇందిరాగాంధీ వైపునకు మళ్లింది. సభలో అనిరుధ్ రెడ్డి అనే జడ్చర్ల ఎమ్మెల్యే ఇప్పసారా మీద పెద్ద ప్రెజంటేషన్ ఇచ్చారు.
సుమారు పది నిమిషాల పాటు మాట్లాడిన ఆయన ఇప్ప సారా చరిత్ర మొత్తం విడమరచి చెప్పారు. దీని ద్వారా ఆదివాసీ ఆదాయం భారీగా పెరుగుతుందని.. ఇలాంటి ఆయుర్వేదిక్ లక్షణాలున్న హెర్బల్ సారా వల్ల ఏకంగా సుగర్ వంటి రోగాలు కూడా మటుమాయం అవుతాయంటూ పూస గుచ్చినట్టు వివరించడం ఇటు కాంగ్రెస్ మాత్రమే కాదు.. అటు బీజేపీకి సైతం.. ఇది బాగా నచ్చేసింది.
దీంతో బీజేపీకి చెందిన రాకేష్ రెడ్డి.. ఈ టాపిక్ పై మాట్లాడ్డానికి ఒకటికి రెండు సార్లు.. పర్మిషన్ అడిగి మరీ మాట్లాడిన ఆయన మాటల్లో మాటగా.. ఆయన దీనికి కూడా ఇందిరమ్మ పేరు పెట్టకండి అనేశారు. ఆ వెంటనే ఈ కామెంట్ కి రియాక్టయిన మంత్రి పొన్నం.. రాకేష్ రెడ్డిని సారీ చెప్పమంటూ చెంప చెళ్లుమనేలా తీవ్రంగా రియాక్టయ్యారు.
ఇందిరాగాంధీ.. తమ పార్టీ ఆరాధ్య దేవతగా చెప్పిన ఆయన, రాకేష్ రెడ్డిపై మరింత సీరియస్ అయ్యారు. సభలో లేని దివంగత మహిళా నేత పట్ల ఇలాంటి కామెంట్లు చేయడం ససేమిరా ఒప్పుకునేది లేదన్నారు పొన్నం. అంతే కాదు ఈ మాటలను రికార్డుల నుంచి తొలగించాలన్న డిమాండ్ చేశారాయన. ఇక శాసన సభ వ్యవహారాల మంత్రి.. శ్రీధర్ బాబు కూడా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంతే కాదు రాకేష్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ దీనిపై రియాక్ట్ కావాలని సూచించారు.
మంత్రి వాకిటి శ్రీహరి సైతం రియాక్టయ్యి.. బీజేపీ వాళ్లకు రాన్రాను బుర్ర, బుద్ధి తప్పుతోందని అన్నారు. మంత్రి సీతక్క సైతం స్పందిస్తూ.. ఒక మహిళా నేతపై బీజేపీ వారు ఇలాంటి కామెంట్లు చేయడం తగదని అన్నారు. ఆపై ఆ సమయంలో ప్రొటెం స్పీకర్ గా ఉన్న బాలూ నాయక్ సైతం రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు.
ఇదే అంశంపై స్పందించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. రాకేష్ రెడ్డి మాట్లాడిన మాటల్లో తమకెలాంటి తప్పు కనిపించలేదన్నారు. ఫైనల్ గా రాకేష్ రెడ్డి కూడా స్పందిస్తూ.. తాను ఇంటెన్షనల్ గా ఈ కామెంట్ చేయలేదనీ.. సోషల్ మీడియాలో ఇందిరాగాంధీపై ఎవరేదైనా కామెంట్ చేస్తే తాను అస్సలు ఒప్పుకోననీ.. అందుకు కారణం వాజ్ పేయి చేత దుర్గా మాతగా కీర్తించబడిన ఇందిర అంటే తమకెంతో గౌరవంగా చెప్పారు.
ఇదంతా ఇలా ఉంటే.. ఎక్కడ ఇప్పసారా? ఎక్కడ ఇందిర? ఈ రెండింటిపై బీజేపీ కామెంట్ చేయడమేంటి? అది సభను ర*సారా*బాసగా మార్చి వేయడమేంటి? అన్న చర్చకు తెరలేచింది జనాల్లో కూడా. ఇప్పసారా దాని ఘనత పక్కకు వెళ్లి.. ఇందిరాగాంధీ టాపిక్ హైలెట్ అయ్యిందని కూడా మాట్లాడుకుంటున్నారు.





