కాంగ్రెస్ పార్టీకి బదులుగా తెరాస గెలిచింది అంతే!

posted on: Dec 19, 2014 11:10AM

 

ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు తమ ఓటమికి తలోరకంగా బాష్యం చెప్పుకొంటే, గెలిచిన పార్టీ తమకు అఖండ ప్రజాధారణ ఉంది గనుకనే గెలవగలిగామని భుజాలు చరుచుకొంటుంటాయి. ఒకానొక సమయంలో తెలంగాణాలో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్న తెరాస గెలిచిన తరువాత ఆవిధంగానే భుజాలు చరుచుకొంది. అయితే బీజేపీ తెలంగాణ ఇన్ చార్జీ మురళీ ధర్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీకి బదులుగా తెరాస గెలిచింది తప్ప ఆ పార్టీ అనుకొంటున్నట్లుగా తెరాస ఏ పార్టీని ఓడించి గెలవలేదని తేల్చి చెప్పారు.

 

ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ కాళ్ళకు చక్రాలు కట్టుకొని తెలంగాణా జిల్లాలు అన్నీ తిరిగి ఎంతగా ప్రచారం చేసినా, ఫలితాలు వెలువడే సమయానికి ఆయన గెలుస్తామనే నమ్మకం కోల్పోయిన మాట వాస్తవం.

 

తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా తమ పార్టీకి భారీ మెజార్టీ రాకపోయినా కనీసం బొటాబొటి సీట్లతోనయినా తాము అధికారంలోకి రావడం ఖాయమని చాలా దృడంగా నమ్మారు. ఒకవేళ తమకు మెజార్టీ రాకపోయినా, తెరాసకు కూడా మెజార్టీ రాదని, అప్పుడు తప్పని పరిస్థితుల్లో తెరాస తమ మద్దతు కోరుతుందని, దానికి మద్దతు ఇచ్చి తెరాసతో కలిసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు భావించిన మాట కూడా వాస్తవం. బహుశః ఈ పరిస్థితిని గమనించిన తరువాతే కేసీఆర్ గొంతులో కొంత మార్పు వచ్చింది. అందుకే ఆ సమయంలో ఆయన మళ్ళీ సోనియాగాంధీ భజన అందుకొన్నారు. కానీ అదృష్టవశాత్తు తెరాస గెలిచింది. తనంతట తానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. దానితో ఆయన గొంతులో కూడా మార్పు వచ్చింది మళ్ళీ. అది చూసి కాంగ్రెస్ నేతలు ఖంగు తిన్నారు.

 

ఇదే విషయాన్ని బీజేపీ నేత ఇప్పుడు మరో విధంగా చెపుతున్నారని భావించవచ్చును. అయితే ఆయన కాంగ్రెస్ ఓటమికి గల అనేక కారణాలకు మరొక కొత్త కారణం కూడా తాజాగా జత చేసారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రజలను ఆకట్టుకొనేందుకే వారికి మతపరమయిన రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నించిందని, ఆ కారణంగానే హిందువులు ఆ పార్టీకి దూరమయ్యారని, అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని, తెరాస గెలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఇప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పంధాలోనే ముందుకు సాగుతూ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇచ్చివారిని ఆకట్టుకోవాలని చూస్తున్నారని కనుక మున్ముందు తెరాస భవిష్యత్ కూడా కాంగ్రెస్ లాగే మారవచ్చని ఆయన జోస్యం చెప్పారు. తెరాస హిందువులకి దూరంగా జరుగుతున్న కొద్దీ వారు బీజేపీకి మరింత చేరువవుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ అమలు చేయాలనుకొంటున్న ముస్లిం రిజర్వేషన్ వల్ల ఆ పార్టీకి ఏమయినా ప్రయోజనం కలుగుతుందో లేదో తెలియదు కానీ బీజేపీకి మాత్రం తప్పకుండా ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...