తెలంగాణలో 16 జిల్లాలకు మొంథా తుపాను ముప్పు
posted on Oct 29, 2025 3:23PM

మొంథా తుపాను ప్రభావం వల్ల తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తుఫాను ముప్పుతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నాది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నగరంలో కురుస్తున్న వర్షం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. డీప్ మ్యాన్హోల్స్ దగ్గర సీవరేజి సూపర్వైజర్లు ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్రాంగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్పూర్, అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, బర్కత్పురా, బీఎన్రెడ్డినగర్, మీర్పేట్, బాలాపూర్, బడంగ్పేట్, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్, జవహర్నగర్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, దోమలగూడలో వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ కోసం జలమండలి హెల్ప్ లైన్ 155313కి కాల్ చేయాలని ఆయన కోరారు.