కొత్త కశ్మీరం.. కన్నీటి గాథ!
posted on Apr 24, 2025 2:34PM
.webp)
కశ్మీర్ లోయ విధ్వంసంలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ
హార్స్ రైడర్ సాహసగాథ..
కలిమాతో తప్పించుకున్న ఓ ప్రొఫెసర్ తెలివైన కథ
హానీ మూన్ కి వచ్చి శవపేటికలో వెళ్లిన నవ వరుడు
బోరున విలపించిన నవ వధువు దీన ప్రేమ గాథ..
తొలిసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కశ్మీరీలు
సీఎం నుంచి కామన్ మేన్ వరకూ అందరిదీ ఒకటే వెత.. కత!
గత కొన్నేళ్ల నుంచి కొత్త కశ్మీరం ఆవిష్కరిస్తున్న వేళ.. ఎన్నడూ లేని విధంగా పర్యాటకులు సందడి చేస్తున్న సమయాన.. కాశ్మీరం నిజంగానే ఒక భూతల స్వర్గమా అనిపించింది. కశ్మీర్ భారత్ లో భాగం అయితే మనకు ఇంతటి భాగ్యం లభిస్తుందా? అన్న కోణంలో స్థానిక కశ్మీరీలు కూడా ఎంతో ఆనందంగా ఉన్న సందర్భం కూడా ఇదే. అయితే గత మూడున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా 26 మంది పర్యాటకులను హతమార్చి.. పాక్ ఉగ్రవాదులు ఇక్కడి వారికి మనశ్శాంతి లేకుండా చేశారు.
సామాన్యుల నుంచి సీఎం వరకూ అందరిదీ ఒకటే మాట. ఇది అమానుషం. ప్రపంచ మానవాళిపై జరిపిన నమ్మక ద్రోహం. ఇదొక అసహ్యకరమైన చర్య. ఈ దాడికి తెగబడింది జంతువులు. వారు అసలు మనుషులు కాదు. తమ రాష్ట్రానికి ఆహ్లాదం వెతుక్కుని వచ్చిన వారు తిరిగి వెళ్లేటపుడు ఆనందంగా వెళ్లకుండా విషాదంగా వెళ్లడం.. తమను తీవ్రంగా బాధిస్తోందని బాధ పడ్డారు సీఎం ఒమర్ అబ్ధుల్లా. మరి కొందరు పర్యాటకులు శవపేటికల్లో వెళ్లడాన్ని తామైతే అసలు జీర్ణించుకోలేక పోతున్నామనీ ఆ దృశ్యాలు తమను కలచి వేస్తున్నాయని అన్నారు సీఎం అబ్దుల్లా.
ఇక కశ్మీరీలైతే.. తాము స్వచ్ఛందంగా హోటళ్లు, షాపులు మూసి వేసి.. నిరసన వ్యక్తం చేశారు. ఇది తమ ప్రాంతానికే మాయని మచ్చలాంటి ఘటనగా వీరు భావిస్తున్నారు. తమ గుండెలపై ఈ దాడి గునపం దించిందనీ, ఒక్కసారిగా పాత కాశ్మీర్ తమ కళ్లకు కట్టిందనీ. ఇన్నాళ్ల పాటు తాము చూసింది కల. ఇదే కఠిక వాస్తవం. మా పాత కశ్మీర్ ని మళ్లీ మాకు వద్దన్నా మా ఉగ్ర మూకలు బహుకరించడం మాకుసుతరామూ ఇష్టం లేదని వారు ఘోషిస్తున్నారు.
15రోజుల పాటు పర్యాటకులకు వసతి సౌకర్యాలతో సహా అన్ని ఉచితంగా ఇస్తామనీ.. సైనికులకు అవసరమైన సహాయ సహకారాలను కూడా అందిస్తామని కశ్మీరీలు అంటున్నారు. ఇది పర్యాటకం డబ్బు దస్కానికి సంబంధించిన వ్యవహారం కాదు. మానవత్వానికి చెందిన అంశం కాబట్టి.. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సాను భూతిని వ్యక్తం చేశారు. తమలో ఒకడైన హార్స్ రైడర్ అదిల్ షా తమ కశ్మీరీల తరఫున ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందడం తమను కలచి వేసిందనీ, పర్యాటకుల పట్ల మా ప్రేమ ఎలాంటిదో అదిల్ షా మరణం రూపంలో తెలియ చేసినట్టుగా స్థానిక కశ్మీరీలు చెబుతున్నారు. మేం మీకోసం ప్రాణం పెడతామనడానికి ఇంతకన్నా నిదర్శనం మరేదీ లేదని అంటున్నారు వారు.
ఇక నవ జంట వినయ్- హిమాన్షుది.. అత్యంత విషాదకరమైన ఘటన. వీరి పెళ్లయ్యింది ఏప్రిల్ 16, ఆమె భర్త విగత జీవిగా మారింది ఏప్రిల్ 22న. పట్టుమని వారం కూడా నిలవని వివాహ బంధం వీరిది. ఆమె అతడి శవపేటిక దగ్గర ఏడ్చిన ఏడుపు.. ఎంత హృదయ విదారకంగా నిలిచిందంటే.. ప్రపంచమంతా ఆమెతో కలసి ఏడ్చేంత. అంతగా ఆమె తన భర్త శవపేటికను వదల్లేక వదులుతూ.. చివరిగా జై హింద్ అంటూ ఆమె చూపిన దేశ భక్తి నభూతో..
ఆ సమయంలో వారికి తెలీదు తమపై ఒక ఉగ్రదాడి జరుగుతుందని. వినయ్ అయితే హిమాన్షుతో కలసి ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నాడు. ఇద్దరూ కలసి ఆడి పాడారు. అతడైతే తాను చనిపోయే సమయానికి భేల్ పూరీ తింటున్నాడు. ఇంతలో ఆమె మొహంపై రక్తం చిందింది. చూస్తే ఒక ఉగ్రవాది తన భర్తను కాల్చి చంపిన దృశ్యం చూసి విలవిలలాడిపోయిందా నవ వధువు.
ఇక కలిమా చదవడం వల్ల బతికిపోయిన దంపతులది మరో రకమైన గ్రేట్ ఎస్కేప్ స్టోరీ. ఒక చెట్టు కింద బెంగాలీ ప్రొఫెసర్ భట్టాచార్య పడుకుని ఉన్నారు. ఆయన కుటుంబం కూడా అక్కడే ఉంది. తాను నిద్రిస్తుండగా.. కలిమా చదువుతున్న చప్పుడు. లేచి చూశాడు. ఏం చేస్తున్నావ్ అంటూ ఒక ఉగ్రవాది అతడ్ని హిందీలో అడిగాడు. అంతే అతడు తనకు తెలిసిన కలీమా బిగ్గరగా చదవడం మొదలు పెట్టాడు. పక్కనే ఉన్నతన్ని కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడా ఉగ్రవాది. దీంతో బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పారిపోయింది భట్టాచార్య కుటుంబం.
పహెల్గాంకి 5 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉండే బైసరన్ పచ్చికబయళ్లు.. ఎంతో ఆహ్లారకరంగా ఉంటాయి.. ఇక్కడికి నడక లేదా గుర్రపు స్వారీ ద్వారా మాత్రమే వెళ్లగలం. అందులో భాగంగా ఇక్కడ హార్స్ రైడర్లు చాలా మంది తమ జీవనోపాధిని వెతుక్కుంటూ ఉంటారు. అలా పర్యాటకులను బైసరన్ కు తన గుర్రం మీద ఎక్కించుకుని నాలుగు డబ్బులు సంపాదిస్తుంటాడు అదిల్ షా. అతడలా వస్తుండగానే ఈ దాడి జరిగింది. అతడైతే ఎంతో వీరోచితంగా ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కో బోతూ.. వారి కాల్పుల్లో చనిపోయాడు. ఇప్పుడతడి భార్యా పిల్లలు, తల్లిదండ్రులు అనాథలయ్యారు. వీరు తమ కుమారుడి మరణ వార్త విని భోరున విలపిస్తున్నారు.
ఇక ఈ ప్రాంతాన్నే ఉగ్రవాదులు ఎంపిక చేసుకోడానికి గల కారణం ఇక్కడ పర్యాటకులు అధికంగా వస్తుండటమే.. వీలైనంత ఎక్కువ మందిని మట్టుపెట్టవచ్చన్న అంచనాలతోనే ఉగ్ర ముఠా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ దాడికి తామే కారకులమంటూ లష్కరే తోయిబా రెసిస్టెన్స్ గ్రూప్ బాధ్యత తీస్కుంది.
ప్రధాని మోడీ అయితే రెండు రోజుల సౌదీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హుటాహుటిన భారత్ చేశారు. హోం మంత్రి అమిత్ షా సీఎం, లెఫ్టెనెంట్ గవర్నర్ తో భేటీ అయ్యి పరిస్థితి సమీక్షించారు. బాధితులతో మాట్లాడారు. ఇక ఢిల్లీలో అత్యవసర భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. ఇకపై పాక్ తో మరోలా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఊహించలేనంత గట్టి దెబ్బ తీస్తామన్నారు రాజ్ నాథ్ సింగ్. ఇకపై ఏ రకమైన దౌత్య సంబంధాలు కూడా పాక్ తో ఉండవని తెగేసి చెప్పారు. ఆ ముగ్గురు ముష్కరులు పాకిస్తానీలే కాబట్టి.. 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలు నిలిపి వేశారు. ఇక్కడి పాక్ దౌత్య వేత్తలను మీ దేశం దయచేయండని హుకుం జారీ చేశారు. భారత్ లో ఉంటున్న పాకిస్తానీలు గానీ, పర్యాటకులు గానీ వారం లోగా భారత్ వీడాలని సూచించారు. పాక్ లోని భారత దౌత్య అధికారుల హోదాలన్నిటినీ రద్దు చేసి.. వారిని తిరిగి వచ్చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడందరి చూపల్లా ఒక్కటే.. ఉగ్రదాడికి భారత సమాధానం ఏ స్థాయిలో ఉంటుందా? అని మాత్రమే!