Latest News
టి 20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా అలవోక విజయం
posted on: Mar 8, 2026 11:15PM

మూడో సారి భారత్ ఖాతాలో టీ 20 వరల్డ్ కప్
హిస్టరీ రిపీటెడ్.. హిస్టరీ రిపీటెడ్
దిల్ మాంగే తీన్మార్
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం (మార్చి 8) జరిగిన టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ఈ స్టేడియంలో భారత్కు మెరుగైన రికార్డు లేదన్న అపవాదును చేరిపేస్తూ పరుగుల వరద పారించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన కివీస్ను బౌలర్లు కట్టుదిట్టంగా కట్టడి చేయడంతో.. భారత్ 96 పరుగుల తేడాతో ఘప విజయం సాధించింది.

తొలుత టాప్ ఆర్డర్లో టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు. 7.2 ఓవర్లలోనే భారత్ 100 పరుగుల మైలురాయి దాటిందంటే మనోళ్ల దూకుడు ఎలా కొనసాగిందో అర్థమవుతుంది. టాప్ ఆర్డర్లో ఓపెనర్ సంజూ సామ్సన్ (89, 46 బంతుల్లో), అభిషేక్ శర్మ (52, 21 బంతులు), ఇషాంత్ కిషన్ (54, 25 బంతులు) తగ్గేదేలే అన్నట్లు బ్యాట్కు పనిచెప్పారు. తర్వాత హార్ధిక్ పాండ్యా (13 బంతుల్లో 18), శివమ్ దూబే (8 బంతుల్లో 26) స్కోరు బోర్డు పరుగులుపెట్టించారు. సూర్యకుమార్ యాదవ్ (0) విఫలమైనప్పటికీ మన ఆటగాళ్లు సమష్టి కృషితో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించారు. చివరి ఓవర్లో దూబే ఏకంగా రెండు సిక్స్లు, మూడు ఫోర్లు బాదడం విశేషం. ఆక్రమంలో 20 ఓవర్లలో 255 పరుగులు చేసి మోడీ స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా టీమ్ ఇండియా రికార్డ్ సృష్టించింది. ఇన్నింగ్స్లో మొత్తం 18 సిక్సులు, 19 ఫోర్లతో మన బ్యాటర్లు చెలరేగిపోయారు.
న్యూజిలాండ్తో జరిగిన తుదిపోరులో భారత్ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయన్న విశ్లేషణలు వినిపించాయి. టీ 20 వరల్డ్ కప్ చరిత్రతో న్యూజిలాండ్పై భారత్కు గెలుపు రికార్డు లేదు. ఇప్పటి వరకు తలపడిన మూడు సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది. ఈ సారి టీంఇండియా చరిత్ర తిరగరాసింది. ఇక గత 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే వేదికపై ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది . ఆ ఓటమి కూడా యాధృచ్చికమే అని మన ఆటగాళ్లు నిరూపించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (52, 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) వరుసగా విఫలమవుతున్నాడన్న విమర్శలను అద్భుత హాఫ్ సెంచరీతో తిప్పికొట్టాడు.
డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా వరుసగా రెండో సారి విజేతగా నిలవడంతో పాటు టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో మూడో సారి టైటిలో గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ టోర్నీ చరిత్రలో మూడు టైటిళ్లు సాధించిన జట్టు లేదు. అలాగే వరుసగా ఏ జట్టూ రెండోసారి గెలవలేదు. అంతే కాదు టి20 వరల్డ్ కప్ ను ఆతిథ్య జట్టు గెలవడం కూడా ఇదే తొలిసారి.






