టీమ్ ఇండియా మహిళల జట్టుపై ప్రశంసల వర్షం
posted on: Oct 31, 2025 12:35PM

మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సెమీఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు కూడా టీమ్ ఇండియా మహిళల జట్టుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసలు కురిపించారు. ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ భారీ లక్ష్యాన్ని కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా 9 బంతులు మిగిలుండగానే ఛేదించడం చూస్తుంటే.. అద్భుత ఫామ్ లో ఉన్న భారత మహిళల జట్టు ఈ టోర్నీలో విజేతగా నిలవడం తథ్యమనిపిస్తోందని కనేరియా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తన అద్భుత సెంచరీతో భారత్ ను విజయతీరాలకు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ను ఆకాశానికెత్తేశాడు. ఆమె అద్భుత బ్యాటింగ్ స్కిల్స్.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుకు విజయాన్నందించిందన్నాడు. భారత మహిళల జట్టు చాలా గోప్పగా ఆడుతోందనీ, జట్టు సమష్టిగా విజయకాంక్షతో ఉరకలేస్తోందనీ ప్రశంసించారు. భారత ఆటగాళ్ల ఫిట్ నెస్ స్థాయి గణనీయంగా మెరుగుపడిందన్న కనేరియా ఇది భారత మహిళల క్రికెట్ భవిష్యత్ కు గొప్ప శుభసూచికంగా అభివర్ణించారు.






